కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ సంచలన వ్యాఖ్యలు చేశారు. “మా పార్టీని మేమే కాపాడుకోలేక పోతున్నాం“ అని అనేశారు. ఇంతగా ఆయన ఆవేదన చెందడానికి, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని తలుచుకుని ఆందోళన వ్యక్తం చేయడానికి కారణం.. ఇటీవల నారాయణ్ఖేడ్లో సొంత పార్టీ నాయకులు బహిరంగ వేదికపై తన్నుకోవడమే. దీనికి తోడు సోషల్ మీడియాలోనూ సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్లను విమర్శిస్తూ.. పోస్టులు రావడమేనని తెలుస్తోంది. తాజాగా మీడియాతో మాట్లాడిన దామోదర.. పార్టీ పరిస్థితి ఇలానే ఉంటే.. ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది.
నారాయణ్ఖేడ్ ఘటనను ఉదహరించిన మంత్రి దామోదర.. వేదికపైనే కాంగ్రెస్ ఎంపీ సురేష్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఉన్నా.. వివాదాలు చోటు చేసుకోవడం.. పార్టీలో నేతల మధ్య ఐనైక్యతకు కారణమని పేర్కొన్నారు. ఇలా జరగడం.. పార్టీకి మంచిది కాదని చెప్పారు. “పార్టీలో అభిప్రాయ బేదాలు ఉండొచ్చు. ఒక నాయకుడికి మరో నాయకుడికి కూడా పడకపోవచ్చు.కానీ, ఇలా బహిరంగంగా కొట్టుకోవడం.. ఏంటి? ఇలా చేస్తే పార్టీని ఎవరు కాపాడుతారు? ఇది మంచిదేనా? అనేది అందరూ ఆలోచించాలి“ అని దామోదర సూచించారు. కాంగ్రెస్ పార్టీ మూలాలను తెలుసుకోకుండా కొందరు వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
పార్టీ ఈ రోజు అధికారంలో ఉందంటే.. దీని వెనుక ఎంతో మంది శ్రమ ఉందని.. దానిని గుర్తించాల్సిన అవసరం నేటి నాయకులకు ఉందని మంత్రి చెప్పారు. “మన పార్టీ బలమే స్వేచ్ఛ, అదే బలహీనత కూడా“ అని అన్నారు. అంతర్గతంగా వచ్చే సమస్యలు పరిష్కరించేందుకు బలమైన నాయకత్వం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అలా కాకుండా.. ఎవరికి వారు సొంత అజెండాలు పెట్టుకుని ముందుకు సాగితే.. పార్టీ భవిష్యత్తు నాశనం అవుతుందని వ్యాఖ్యానించారు. తామంతా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి శిష్యులమని చెప్పిన మంత్రి.. ఆయన కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఎక్కడా కట్టు తప్పకుండా పార్టీని, నాయకులను ముందుకు నడిపించారని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తిని నేడు నాయకులు అందరూ అనుసరించాల్సిన అవసరం ఉందని దామోదర అభిప్రాయపడ్డారు. “పార్టీలో అనేక మంది నాయకులు ఉన్నారు. వారంతా కీలకమే. రాజకీయంగా విభేదాలు ఉంటాయి. కానీ, అవి పార్టీ నాశనానికి దారి తీయకూడదు. అందరూ ఐక్యంగా ఉండి పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చే విషయంపై పనిచేయాలి“ అని మంత్రి రాజనర్సింహ సూచించారు.