పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ ప్రోద్బలం ఉందని గట్టిగా నమ్ముతున్న భారత్… దాయాది దేశాన్ని అష్టదిగ్బంధనం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. పలు కఠిన ఆంక్షలతో పాక్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న భారత కేంద్ర ప్రభుత్వం… తాజాగా సముద్ర రవాణా మార్గాల వైపు దృష్టిసారించింది. పాకిస్థాన్ తో సముద్ర రవాణా మార్గాలను మూసివేసింది.
మర్చంట్ షిప్పింగ్ యాక్ట్-1958లోని సెక్షన్-411 ప్రకారం కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో, పాకిస్థాన్ జెండా కలిగిన నౌకలు భారత పోర్టుల్లోకి ప్రవేశించడంపై నిషేధం అమల్లోకి వస్తుంది. అంతేకాదు, భారత జెండా కలిగిన నౌకలు కూడా పాకిస్థాన్ పోర్టుల్లోకి వెళ్లడంపై నిషేధం ఉంటుంది. తాజా చర్య ద్వారా పాకిస్థాన్ తో భారత్ అన్ని రకాల సంబంధాలు తెంచుకుంటున్నట్టు అర్థమవుతోంది.
ఇప్పటికే పాకిస్థాన్ విమానాలకు భారత్ గగనతలం మూసివేసింది. వాణిజ్యపరమైన అంశాల్లో కూడా నిషేధం ప్రకటించింది. తాజాగా సముద్ర రవాణా మార్గాలను మూసివేస్తూ… పాకిస్థాన్ ఆర్థిక మూలాలు దెబ్బతీయడమే లక్ష్యంగా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది.