ఒడిశాలో 35 సంవత్సరాలుగా నివసిస్తున్న శారదాబాయి అనే పాకిస్థానీ మహిళను తక్షణం దేశం విడిచి వెళ్లాలని ఆ రాష్ట్ర పోలీసులు ఆదేశాలు జారీచేశారు. ఆమె వీసాను రద్దు చేసిన అధికారులు ఆలస్యం చేయకుండా భారత్ను విడిచిపెట్టాలని ఆదేశించారు. అందుకు నిరాకరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
శారదాబాయి బోలంగిర్కు చెందిన మహేశ్ కుక్రేజా అనే హిందూ వ్యక్తిని కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఆమె కుమారుడు, కుమార్తె మాత్రం భారతీయులే. ఆమె వద్ద ఓటర్ గుర్తింపు కార్డు వంటి కీలక పత్రాలు ఉన్నప్పటికీ అధికారులు మాత్రం ఆమెకు భారత పౌరసత్వం ఇవ్వలేదు. తక్షణం భారత్ను విడిచిపెట్టాలన్న అధికారుల ఆదేశాలతో డైలమాలో పడిన శారదాబాయి.. కుటుంబం నుంచి తనను వేరు చేయవద్దని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. మూడు దశాబ్దాలుగా భారతదేశమే తన ఇల్లు అని, కాబట్టి ఇక్కడ ఉండేందుకు అనుమతించాలని చేతులు జోడించి అభ్యర్థించారు.
తాను తొలుత కోరాపుట్ వచ్చానని, ఆ తర్వాత బోలంగిర్కు మారానని శారదాబాయి తెలిపారు. పాకిస్థాన్లో తనకు ఎవరూ లేరని, తన పాస్పోర్టు కూడా చాలా పాతదని పేర్కొన్నారు. తనకు ఎదిగిన ఇద్దరు పిల్లలు, మనవళ్లు ఉన్నారని వివరించారు. తానిక్కడ భారతీయురాలిగానే ఉండాలని అనుకుంటున్నానని, కాబట్టి తనను వెనక్కి పంపించవద్దని కోరారు. ఆమె అభ్యర్థన చాలామందిని కదిలించింది. అయితే, బోలంగిర్ పోలీసులు మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.