పాక్‌పై ఒవైసీ ఫైర్: అరగంట కాదు.. అర్ధ శతాబ్దం వెనుక!

V. Sai Krishna Reddy
2 Min Read

పాకిస్థాన్‌పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భారత్ కంటే పాకిస్థాన్ అరగంట కాదు, ఏకంగా అర్ధ శతాబ్దం వెనుకబడి ఉందని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలోని ప్రభానీలో వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఒవైసీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇటీవల పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు.

పాకిస్థాన్ నేతల అణుబాంబు బెదిరింపులను ప్రస్తావిస్తూ, “మీరు అరగంట కాదు, అర్ధ శతాబ్దం వెనుకబడి ఉన్నారు. మీ దేశ బడ్జెట్ మా సైనిక బడ్జెట్‌తో కూడా సరిపోదు” అని ఒవైసీ అన్నారు. “పాకిస్థాన్ పదేపదే తమ వద్ద అణుబాంబులు, ఆటం బాంబులు ఉన్నాయని చెబుతోంది. గుర్తుంచుకోండి, మీరు వేరే దేశంలోకి వెళ్లి అమాయక ప్రజలను చంపితే, ఏ దేశం మౌనంగా ఉండదు” అని ఆయన హెచ్చరించారు.

పహల్గామ్ లో ఉగ్రవాదులు పర్యాటకుల మతాన్ని అడిగి మరీ హత్య చేశారని ఒవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. “మీరు ఏ మతం గురించి మాట్లాడుతున్నారు? మీరు ఖవారీజ్‌ల కంటే నీచులు. మీ చర్యలు మీరు ఐసిస్ వారసులని చూపిస్తున్నాయి” అని తీవ్రంగా విమర్శించారు. భారత్‌ను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ ఏళ్లుగా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందని ఆరోపించారు. పాకిస్థాన్ వైమానిక దళాన్ని దిగ్బంధించడానికి, వారి ఇంటర్నెట్‌ను హ్యాక్ చేయడానికి అంతర్జాతీయ చట్టాలు భారత్‌కు అనుమతిస్తున్నాయని కూడా ఒవైసీ పేర్కొన్నారు.

పాకిస్థాన్‌ను ఆర్థికంగా బలహీనపరిచే చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒవైసీ డిమాండ్ చేశారు. కశ్మీర్ లాగే కశ్మీరీలు కూడా భారతదేశంలో అంతర్భాగమని స్పష్టం చేశారు. “కొందరు టీవీ ఛానల్ యాంకర్లు కశ్మీరీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వారు సిగ్గులేనివారు. కశ్మీర్ మన అంతర్భాగం అయినప్పుడు, కశ్మీరీలు కూడా మన అంతర్భాగమే. వారిని ఎలా అనుమానిస్తాం?” అని ఒవైసీ ప్రశ్నించారు. ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు అర్పించింది కశ్మీరీయేనని, గాయపడిన చిన్నారిని తన వీపుపై మోసుకుని 40 నిమిషాలు నడిచి ప్రాణాలు కాపాడింది కూడా కశ్మీరీయేనని ఆయన గుర్తు చేశారు.

వక్ఫ్ (సవరణ) చట్టంపై మాట్లాడుతూ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ప్రకటించిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 30న ‘బత్తీ గుల్’ కార్యక్రమంలో భాగంగా లైట్లు ఆర్పివేయాలని కోరారు. ఈ బిల్లుకు మద్దతు తెలిపినందుకు అజిత్ పవార్, నితీశ్ కుమార్, జయంత్ చౌదరి, చంద్రబాబు నాయుడులపై ఒవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వీరిని ముస్లింలు, లౌకికవాదులు క్షమించరని అన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం ద్వారా తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును ఫణంగా పెట్టారని ఒవైసీ విమర్శించారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *