ఈ-కామర్స్ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, తన వినియోగదారుల కోసం ‘గ్రేట్ సమ్మర్ సేల్ 2025’ తేదీలను అధికారికంగా ప్రకటించింది. నడి వేసవిలో సూపర్ కూల్ ఆఫర్లతో ఈ సేల్ మే 1వ తేదీన ప్రారంభం కానుంది. ప్రైమ్ సభ్యులకు ప్రత్యేకంగా ఒక రోజు ముందుగానే డీల్స్ అందుబాటులోకి రానున్నాయి.
అమెజాన్ వెల్లడించిన వివరాల ప్రకారం, గ్రేట్ సమ్మర్ సేల్ 2025 సాధారణ వినియోగదారుల కోసం మే 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. అయితే, అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉన్నవారికి మాత్రం ఏప్రిల్ 30 అర్ధరాత్రి నుంచే అన్ని ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి. సేల్ ముగింపు తేదీని అమెజాన్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ఈ సేల్ సందర్భంగా ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గృహోపకరణాలు, కిచెన్ ఉత్పత్తులు సహా అనేక రకాల కేటగిరీలపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఏసీలు, టీవీలు, స్మార్ట్వాచ్లు, ఇయర్బడ్స్ వంటి వాటిపై ప్రత్యేక డీల్స్ ఉంటాయని పేర్కొంది. శాంసంగ్, షామీ, వన్ప్లస్ వంటి ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను వినియోగదారులు ఆశించవచ్చు.
బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే, HDFC బ్యాంక్ కస్టమర్లకు ప్రత్యేక ప్రయోజనం చేకూరనుంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులు లేదా EMI లావాదేవీల ద్వారా కొనుగోళ్లు చేసేవారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుందని అమెజాన్ స్పష్టం చేసింది. దీంతో పాటు, నో-కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా పాత వస్తువులను మార్చుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు తెలిపింది.
సేల్ సమయంలో కొనుగోలు చేసే వస్తువులపై ఉచిత డెలివరీ, సులభమైన రిటర్న్ పాలసీ, క్యాష్ ఆన్ డెలివరీ వంటి సదుపాయాలు కూడా యధావిధిగా ఉంటాయని అమెజాన్ హామీ ఇచ్చింది. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కంపెనీ సూచిస్తోంది.