ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని సురక్షితంగా తీసుకురావాలంటూ నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ పిల్ను దాఖలు చేసింది. ప్రమాదం జరిగి పది రోజులవుతున్నప్పటికీ కార్మికుల ఆచూకీ లేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది.
తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. టన్నెల్ సహాయక చర్యల్లో ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఇరవై నాలుగు గంటలు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. సహాయక చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని కోర్టుకు తెలిపారు. అడ్వొకేట్ జనరల్ తెలిపిన వివరాలను నమోదు చేసిన హైకోర్టు పిల్పై విచారణను ముగించింది.