ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో స్థిరాస్థి రంగం ఆశించిన స్థాయిలోనే ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని నోవాటెల్లో ఐజీబీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రీన్ తెలంగాణ సమ్మిట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలు పెంచేలా రూ.10 వేల కోట్లను కేటాయించినట్లు చెప్పారు.
మూసీ సుందరీకరణ పనులు చేపట్టామని ఆయన అన్నారు. రాష్ట్ర ఆదాయం తగ్గుతుందని తెలిసినా, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈవీ పాలసీని తీసుకువచ్చామని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేలా మినహాయింపులు ఇచ్చామని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, అన్ని వర్గాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు ఉంటాయని అన్నారు.
ఫ్యూచర్ సిటీని నెట్ జీరో సిటీగా నిర్మించాలనేది తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. ప్రపంచానికే ఆదర్శంగా ఉండేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంకితభావాన్ని చెప్పేందుకే ఐజీబీసీతో ప్యూచర్ సిటీపై ఎంవోయూ కుదుర్చుకున్నట్లు చెప్పారు.