- 2 వేల జరిమానా.. అప్పీలుకు నాలుగు వారాల గడువు!
హైదరాబాద్ (ప్రజాజ్యోతి) కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసినందుకు గానూ మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగా కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు ఆయనకు 6 నెలల సాధారణ జైలు శిక్షతో పాటు 2,000 జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం బోనాల్ గ్రామ నివాసి లక్ష్మి అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఈ విచారణ చేపట్టింది. ఒక భూ వివాదంలో గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను కలెక్టర్ పట్టించుకోలేదని, అమలు చేయడంలో విఫలమయ్యారని ఆమె కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కలెక్టర్ తీరును తప్పుబట్టింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడం తీవ్రమైన విషయంగా పరిగణిస్తూ శిక్ష ఖరారు చేసింది. శిక్ష విధిస్తూనే, ఈ తీర్పుపై కలెక్టర్ పైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు వీలుగా హైకోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చింది. అప్పటి వరకు శిక్ష అమలును వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
