నర్సాపూర్ (ప్రజాజ్యోతి) నర్సాపూర్లోని ప్రభుత్వ గిరిజన గురుకుల కళాశాల విద్యార్థుల మధ్య చెలరేగిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. కళాశాలలో పర్యవేక్షణ లోపం కారణంగా విద్యార్థులు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు విద్యార్థులను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. కళాశాలలో సీఈసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న రాంనాయక్ అనే విద్యార్థికి, తోటి విద్యార్థులైన కౌశిక్, ఆకాష్, రెడ్యాలకు మధ్య గత కొద్దిరోజులుగా మనస్పర్థలు ఉన్నాయి. ఈ క్రమంలో రామ్ నాయక్ కోటి విద్యార్థులను కించపరచకపోయినా, తోటి విద్యార్థులు పరస్పరం భౌతిక దాడులకు దిగారు. విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ బలరాం పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్ఐ రంజిత్ రెడ్డి కళాశాలకు చేరుకుని విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మరుసటి రోజు తల్లిదండ్రులను పిలిపించి, మరోసారి గొడవలకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
విద్యార్థికి అస్వస్థత..
విద్యార్థుల దాడిలో గాయపడిన రాంనాయక్ ఆదివారం ఉదయం ఛాతీలో విపరీతమైన నొప్పిగా ఉందని సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. పరిస్థితిని గమనించిన ప్రిన్సిపాల్ వెంటనే అతడిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిర్వహించిన ఎక్స్రే, ఈసీజీ పరీక్షల్లో నివేదిక సాధారణంగా వచ్చినప్పటికీ, వైద్యుల సూచన మేరకు మెరుగైన పరీక్షల కోసం విద్యార్థిని ప్రిన్సిపాల్ తన సొంత వాహనంలో సంగారెడ్డికి తీసుకెళ్లారు.
పర్యవేక్షణ లోపమే కారణమా.?
కళాశాల సిబ్బంది మరియు లెక్చరర్ల మధ్య పర్యవేక్షణ లోపం వల్లే విద్యార్థులు పెడదారి పడుతున్నారని, గొడవలు ముదురుతున్నాయని స్థానికంగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై ప్రిన్సిపాల్ స్పందిస్తూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గొడవకు కారణమైన ముగ్గురు విద్యార్థులను కళాశాల నుండి సస్పెండ్ చేసి ఇంటికి పంపినట్లు వెల్లడించారు.
