రూ..2.5 కోట్ల ప్యాకేజితో చరిత్ర సృష్టించిన ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి

V. Sai Krishna Reddy
2 Min Read

హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ- హైదరాబాద్) విద్యార్థి భారీ ప్యాకేజీతో సంచలనం సృష్టించాడు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్‌కు నెదర్లాండ్స్‌కు చెందిన గ్లోబల్ ట్రేడింగ్ సంస్థ ఆప్టివర్ ఏకంగా రూ. 2.5 కోట్ల వార్షిక వేతనాన్ని ఆఫర్ చేసింది. 2008లో ఐఐటీ హైదరాబాద్ ఏర్పాటైన నాటి నుంచి ఇదే అత్యధిక ప్యాకేజీ కావడం విశేషం.

 

ఈ ఆఫర్ రెండు నెలల సమ్మర్ ఇంటర్న్‌షిప్ ద్వారా ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్ (పీపీఓ)గా వచ్చింది. ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన ఇద్దరిలో వర్గీస్ ఒక్కరే పీపీఓ అందుకోవడం గమనార్హం. 21 ఏళ్ల వర్గీస్ జులై నుంచి ఆప్టివర్ నెదర్లాండ్స్ కార్యాలయంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పూర్తిస్థాయిలో విధుల్లో చేరనున్నాడు. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన వర్గీస్, తన తల్లిదండ్రులిద్దరూ ఇంజినీర్లేనని తెలిపారు.

ఈ విజయంపై వర్గీస్ మాట్లాడుతూ, “ఇదే నా మొదటి, ఏకైక ఇంటర్వ్యూ. పీపీఓ వస్తుందని నా మెంటార్ చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఫస్ట్ ఇయర్ నుంచి కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్‌లో దేశంలోని టాప్ 100లో ఉండటం ఇంటర్వ్యూలో నెగ్గడానికి బాగా ఉపయోగపడింది. ఐఐటీ ట్యాగ్ కూడా కలిసొచ్చింది” అని వివరించారు.

ఈ ప్లేస్‌మెంట్ సీజన్‌లో మరో కంప్యూటర్ సైన్స్ విద్యార్థి రూ. 1.1 కోట్ల ప్యాకేజీని అందుకోవడం విశేషం. ఈ ఏడాది సంస్థ సగటు ప్యాకేజీ గత ఏడాదితో పోలిస్తే 75 శాతం పెరిగి రూ. 20.8 లక్షల నుంచి రూ. 36.2 లక్షలకు చేరింది. డిసెంబరులో ముగిసిన మొదటి దశ ప్లేస్‌మెంట్లలో 487 మంది యూజీ విద్యార్థులకు గాను 62 శాతం మంది ఉద్యోగాలు పొందారు.

అధిక ప్యాకేజీల కంటే, ప్లేస్‌మెంట్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులందరికీ మంచి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని కెరీర్ సర్వీసెస్ ఫ్యాకల్టీ ఇన్‌చార్జి మయూర్ వైద్య తెలిపారు. టెక్ ఉద్యోగాలతో పాటు కోర్ ఇంజినీరింగ్ విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించామని ఆయన చెప్పారు. త్వరలో ప్రారంభం కానున్న ఫేజ్-2 ప్లేస్‌మెంట్లలో మరిన్ని దేశీయ కంపెనీలు పాల్గొంటాయని ఐఐటీహెచ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *