గ్రేటర్ పోలీసు వ్యవస్థలో భారీ మార్పులు.. నలుగురు సీపీల నియామకం

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పరిపాలన సంస్కరణల్లో భాగంగా పోలీసు శాఖలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ‘తెలంగాణ రైజింగ్ 2047’ దార్శనికతకు అనుగుణంగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శాంతిభద్రతలను మరింత పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం పోలీస్ కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరించింది. ఇప్పటివరకు ఉన్న మూడు కమిషనరేట్ల స్థానంలో ఇకపై నాలుగు కమిషనరేట్లు (హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ) సేవలందించనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నూతన విధానంలో కమిషనరేట్ల పరిధిని ప్రభుత్వం స్పష్టంగా విభజించింది. అసెంబ్లీ, సచివాలయం, బేగంపేట, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వంటి కీలక ప్రాంతాలతో హైదరాబాద్ కమిషనరేట్ కొనసాగనుండగా.. ఐటీ హబ్‌లు, పారిశ్రామిక ప్రాంతాలతో సైబరాబాద్‌ను మార్పు చేశారు. కీసర, షామిర్‌పేట, కుత్బుల్లాపూర్ వంటి ప్రాంతాలతో కొత్తగా ‘మల్కాజిగిరి’ కమిషనరేట్‌ను.. చేవెళ్ల, మొయినాబాద్, మహేశ్వరం వంటి ప్రాంతాలతో ‘ఫ్యూచర్ సిటీ’ కమిషనరేట్‌ను ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో యాదాద్రి-భువనగిరి ప్రాంతాన్ని కమిషనరేట్ పరిధి నుంచి తొలగించి, ప్రత్యేక ఎస్పీ నేతృత్వంలో జిల్లా పోలీసు యూనిట్‌గా మార్చారు.

నూతన సీపీల నియామకం

ఈ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో నలుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

* హైదరాబాద్ సీపీ: వీసీ సజ్జనార్ (కొనసాగింపు)

* సైబరాబాద్ సీపీ: ఎం.రమేశ్‌ (గతంలో లాజిస్టిక్స్ ఐజీ)

* మల్కాజిగిరి సీపీ: అవినాశ్‌ మహంతి (గతంలో సైబరాబాద్ సీపీ)

* ఫ్యూచర్ సిటీ సీపీ: జి.సుధీర్ బాబు (గతంలో రాచకొండ సీపీ)

* యాదాద్రి-భువనగిరి ఎస్పీ: అక్షాంశ్‌ యాదవ్

జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా చేరిన 27 మున్సిపాలిటీలు, జోనింగ్ సంస్కరణల నేపథ్యంలో ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *