నేడు అండర్-19 ఆసియా కప్ ఫైనల్… పాక్ తో అమీతుమీ తేల్చుకోనున్న భారత్

V. Sai Krishna Reddy
1 Min Read

అండర్-19 ఆసియా కప్ టైటిల్ పోరుకు సర్వం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా ఈరోజు జరగనున్న ఫైనల్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నారు. టోర్నీలో అద్భుత ఫామ్‌లో ఉన్న యువ భారత్ మరోసారి పాక్‌పై గెలిచి, రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి కప్‌ను ముద్దాడాలని పట్టుదలగా ఉంది.

ఆయుష్ మాత్రే సారథ్యంలోని భారత జట్టు ఈ టోర్నీలో అజేయంగా కొనసాగుతోంది. ముఖ్యంగా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో 400 పైచిలుకు స్కోర్లు నమోదు చేశారు. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (171), అభిజ్ఞాన్ కుందు (209) భారీ శతకాలతో సూపర్ ఫామ్‌లో ఉన్నారు. మిడిల్ ఆర్డర్‌లో ఆరోన్ జార్జి, ఫినిషర్‌గా కాన్టిక్ చౌహాన్ రాణిస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. బౌలింగ్‌లో పేసర్ దేవేశ్ దేవేంద్రన్ 11 వికెట్లతో జట్టుకు కీలకంగా మారాడు.

మరోవైపు, పాకిస్థాన్‌ను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. సెమీస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకొచ్చింది. ఆ జట్టు ఓపెనర్ సమీర్ మిన్హాస్ టోర్నీ టాప్ స్కోరర్‌గా (299 పరుగులు) ఉండగా, పేసర్ అబ్దుల్ సుభాన్ 11 వికెట్లతో ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు. అయితే, లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ను భారత కుర్రాళ్లు 90 పరుగుల తేడాతో ఓడించారు. అదే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నారు.

ఈ మ్యాచ్ దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్, సోనీలివ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *