విద్యుత్ పనుల కోసం లంచం.. అధికారిని పట్టించిన కాంట్రాక్టర్

V. Sai Krishna Reddy
1 Min Read

నగరంలో మరో అవినీతి అధికారి ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. సికింద్రాబాద్ పరిధిలో ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.15,000 లంచం తీసుకుంటుండగా టీజీఎస్పీడీసీఎల్ సబ్ ఇంజినీర్‌ను అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

సికింద్రాబాద్ పద్మారావు నగర్ సబ్ డివిజన్‌లోని లాలాగూడ సెక్షన్‌లో భూమిరెడ్డి సుధాకర్ రెడ్డి సబ్ ఇంజినీర్‌గా (ఇన్‌చార్జ్ అసిస్టెంట్ ఇంజినీర్) పనిచేస్తున్నారు. ఓ కాంట్రాక్టర్ చేపట్టిన ఎలక్ట్రికల్ పనులకు సంబంధించి సింగిల్ ఫేజ్ మీటర్లను త్రీ ఫేజ్ మీటర్లుగా మార్చాల్సి ఉంది. దాంతో పాటు, అదే ప్రదేశంలో 63 కేవీఏ సామర్థ్యం గల కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన అంచనా కాపీని సిద్ధం చేసి, ఫైల్‌ను ముందుకు పంపాల్సి ఉంది.

ఈ పనులు పూర్తిచేయడం కోసం సుధాకర్ రెడ్డి సదరు కాంట్రాక్టర్‌ను రూ.15,000 లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టంలేని ఆ కాంట్రాక్టర్ నేరుగా ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందం నిన్న సుధాకర్ రెడ్డి ఆ డబ్బును తీసుకుంటుండగా అదుపులోకి తీసుకుంది.

ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా అధికారులు లంచం కోసం వేధిస్తే ప్రజలు భయపడకుండా తమకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు కోరారు. ఫిర్యాదుదారుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064కు గానీ, వాట్సాప్ నెంబర్ 9440446106కు గానీ ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఏసీబీ వెబ్‌సైట్ లేదా ఫేస్‌బుక్ పేజీ ద్వారా కూడా సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *