తెలంగాణ పత్తి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాబోయే వారంలోనే సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ద్వారా పత్తి కొనుగోళ్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.
తన నివాసంలో పత్తి కొనుగోళ్ల అంశంపై నిన్న సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి, ప్రస్తుతం కొనుగోలు ప్రక్రియ ఆలస్యం కావడంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
సీసీఐ, మిల్లర్లతో సమావేశం – ఈ నెల 6న మరోసారి చర్చ
ఈ నెల 6వ తేదీన సీసీఐ సీఎండీ, కాటన్ మిల్లర్ల సంఘం ప్రతినిధులతో మరోసారి సమావేశమవుతానని మంత్రి వెల్లడించారు. జిన్నింగ్ మిల్లులు సీసీఐ టెండర్లలో పాల్గొనకపోవడం వల్ల కొనుగోళ్ల ప్రక్రియలో ఏర్పడిన సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లామని తెలిపారు. సీసీఐ అధికారులు, మిల్లర్లతో సచివాలయంలో రెండు దఫాలు సమావేశం నిర్వహించినట్లు మంత్రి చెప్పారు.
“రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఉపేక్షించం”
అధిక వర్షాల కారణంగా పత్తి దిగుబడి ఆశించిన స్థాయిలో రాలేదన్నారు. ఈ నేపథ్యంలో అన్నదాతల ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ప్రభుత్వం ఉపేక్షించదని మంత్రి హెచ్చరించారు. “రాబోయే వారం రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పత్తి కొనుగోళ్లు ప్రారంభం కావాల్సిందే” అని ఆయన స్పష్టం చేశారు.
గత సీజన్ విధానాలే కొనసాగింపు – సడలింపులపై చర్చ
గత సంవత్సరం అమలు చేసిన విధానాలను ఈ సీజన్లోనూ కొనసాగించాలని మిల్లర్లకు సూచించామని మంత్రి తెలిపారు. లింట్ శాతం, ఎల్-1 స్లాట్ బుకింగ్ ఏరియా మ్యాపింగ్ వంటి అంశాలపై అభ్యంతరాలు వచ్చినా, కొన్ని నిబంధనల్లో సడలింపులు ఇచ్చి, మిగతావన్నీ యథాతథంగా అమలు చేస్తామని సీసీఐ అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిపారు.