అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి బుధవారం ట్రేడింగ్లో భారీ లాభాలను నమోదు చేసింది. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు పునఃప్రారంభం కానుండటంతో మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొంది. దీనికి తోడు అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడటంతో, రూపాయి మారకం విలువ రెండు వారాల్లో తొలిసారిగా 88 మార్కు కంటే దిగువకు చేరింది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి 23 పైసలు బలపడి 87.82 వద్ద కొనసాగింది.
మంగళవారం నాటి ట్రేడింగ్లో రూపాయి 7 పైసలు లాభపడి 88.09 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. అయితే, ఈరోజు అంతకంటే మెరుగైన ప్రదర్శన కనబరిచింది. రూపాయి బలపడటానికి అంతర్జాతీయ పరిణామాలు కూడా తోడయ్యాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం అంచున ఉందని వస్తున్న వార్తలతో డాలర్ ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడికి గురైంది. ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ప్రధాన ఆర్థికవేత్త మార్క్ జాండీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అమెరికాలో ఉద్యోగాలు, ఉత్పాదకత, వ్యయాలకు సంబంధించిన డేటాను బట్టి చూస్తే దేశం మాంద్యం ముంగిట ఉందని ఆయన విశ్లేషించారు.
ఈ సానుకూల పరిణామాలు ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకోబోయే నిర్ణయం కోసం మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల ప్రవాహంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
విశ్లేషకుల అంచనా ప్రకారం, రూపాయికి 88.20 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఒకవేళ రూపాయి 87.90 స్థాయిని దాటి మరింత బలపడితే, 87.50 లేదా 87.20 స్థాయులకు కూడా చేరే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, డాలర్ ఇండెక్స్ 0.11 శాతం పెరిగి 96.73 వద్ద ఉండగా, బ్రెంట్ ముడిచమురు ఫ్యూచర్స్ ట్రేడ్లో 0.20 శాతం తగ్గి బ్యారెల్కు 68.33 డాలర్ల వద్ద కొనసాగుతోంది