శంకర్‌పల్లిలో సినిమాను మించిన సీన్.. రూ.40 లక్షల దోపిడీ తర్వాత కారు బోల్తా!

V. Sai Krishna Reddy
2 Min Read

రంగారెడ్డి జిల్లాలో పట్టపగలే ఓ భారీ దోపిడీ జరిగింది. సినిమా కథను తలపించేలా రూ. 40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అక్కడి నుంచి పారిపోయే క్రమంలో కారు ప్రమాదానికి గురవడంతో కథ అడ్డం తిరిగింది. ఈ అనూహ్య ఘటన శంకర్‌పల్లి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది.

హైదరాబాద్‌కు చెందిన స్టీల్ వ్యాపారి రాకేశ్ అగర్వాల్ వద్ద పనిచేసే డ్రైవర్ మధు, ఉద్యోగి సాయిబాబా.. వికారాబాద్‌లోని ఓ కస్టమర్ నుంచి రూ.40 లక్షల నగదు తీసుకుని కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. వారిని మరో కారులో వెంబడిస్తున్న నలుగురు దుండగులు నిన్న మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో శంకర్‌పల్లి మండలం హుస్సేన్‌పూర్ శివారులో వారి వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టారు. కారు ఆగగానే ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు కిందకు దిగి డ్రైవర్ మధు కళ్లలో కారం చల్లారు. అనంతరం వెనుక అద్దం పగలగొట్టి సాయిబాబాను డమ్మీ పిస్తోల్‌తో బెదిరించి, ఆయన వద్ద ఉన్న నగదు బ్యాగును లాక్కొని వారి కారులో వేగంగా పరారయ్యారు.

అయితే, దుండగుల ప్రణాళిక బెడిసికొట్టింది. సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలోని కొత్తపల్లి గ్రామానికి చేరుకోగానే వారి కారు అదుపుతప్పి ఓ కల్వర్టును ఢీకొని బోల్తా పడింది. వెంటనే తేరుకున్న నలుగురూ కారును అక్కడే వదిలేసి డబ్బు సంచితో పరారయ్యేందుకు ప్రయత్నించారు. ప్రమాద శబ్దం విని అక్కడికి చేరుకున్న స్థానికులు ఏం జరిగిందని ప్రశ్నించగా, తమపై ఎవరో దాడి చేస్తున్నారంటూ కట్టుకథ చెప్పి అక్కడి నుంచి ఉడాయించారు.

వారి ప్రవర్తనపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును తనిఖీ చేయగా, అందులో రూ.8.71 లక్షల నగదు, ఒక డమ్మీ పిస్తోల్, కత్తి, కారం పొడి ప్యాకెట్లు, మద్యం బాటిల్ లభ్యమయ్యాయి. దోచుకెళ్లిన మొత్తంలో కొంత భాగాన్ని వారు కారులోనే వదిలేసి వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులను పట్టుకునేందుకు సీసీఎస్, ఎస్‌వోటీ బృందాలతో కలిపి మొత్తం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు వారు తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *