ఒడిశాలో భారీ స్థాయిలో బంగారు ఖనిజ నిక్షేపాలు బయటపడినట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సుమారు 10 నుంచి 20 మెట్రిక్ టన్నుల నిక్షేపాలను గుర్తించినట్లు తెలిపింది. సుందర్ గఢ్, నవరంగ్ పూర్, కియోంజర్, దేవగఢ్ జిల్లాల్లో ఇప్పటికే బంగారు నిక్షేపాల వెలికితీత పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఈ క్రమంలో మైనింగ్ కార్పొరేషన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ పరిశోధనలు చేపట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర చుక్కలను అంటుతున్న వేళ ఒడిశాలో బంగారు నిక్షేపాల సంగతి బయటపడడంతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ దెబ్బతో రాష్ట్రం సంపన్న రాష్ట్రంగా మారిపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
బంగారు నిల్వలు ఉన్న ప్రాంతాలు..
మయూర్ భంజ్ జిల్లాలోని ఝాసిపూర్, సూర్యాగుడా, రువంశి, ఇదెల్కుచా, మారెడిమి, సులేపట్, బడం పహాడ్
దేవగఢ్ జిల్లాలోని ఆదసా – రాంపల్లి
కియోంజర్ జిల్లాలో గోపూర్, గజీపూర్, మంకాడ్ చువాన్, సలేకానా, దిమిరి ముండా
మల్కాన్ గిరి, సంబల్ పూర్, బౌద్ జిల్లాల్లో సైతం పెద్ద ఎత్తున బంగారు నిల్వలు ఉన్నట్లు శాస్త్రవేత్తల అంచనా