ఆస్ట్రేలియాకు క్యూ కడుతున్న భారత పర్యాటకులు.. కారణం ఇదే!

V. Sai Krishna Reddy
1 Min Read

పర్యాటకం కోసం ఆస్ట్రేలియా వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సులభతరం చేసిన వీసా నిబంధనలు, పెరిగిన విమాన సర్వీసులు ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. అందమైన ప్రకృతి, ప్రత్యేకమైన వన్యప్రాణులు, సిడ్నీ ఒపెరా హౌస్ వంటి అద్భుత కట్టడాలు ఉన్న ఆస్ట్రేలియా అంటే భారతీయులకు ఎప్పటినుంచో ఆసక్తి ఉన్నప్పటికీ, ఈ ఏడాది పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది.

టూరిజం ఆస్ట్రేలియా వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం, ఈ ఏడాది మార్చితో ముగిసిన సంవత్సరంలో సుమారు 4,50,000 మంది భారతీయులు ఆస్ట్రేలియాను సందర్శించారు. ఇది గతేడాదితో పోలిస్తే 9.4 శాతం అధికమని టూరిజం ఆస్ట్రేలియా కంట్రీ మేనేజర్ (ఇండియా అండ్‌ గల్ఫ్) నిశాంత్ కాశికర్ తెలిపారు.

పర్యాటకుల పెరుగుదలకు ప్రధాన కారణం సులభతరం చేసిన వీసా ప్రక్రియ అని ఆయన వివరించారు. అమెరికా, యూకే వంటి దేశాలతో పోలిస్తే ఆస్ట్రేలియా వీసా విధానం పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉండటం, పాస్‌పోర్ట్‌ను భౌతికంగా సమర్పించాల్సిన అవసరం లేకపోవడం, బయోమెట్రిక్స్ లేదా ఇంటర్వ్యూలు వంటివి లేకపోవడంతో భారతీయులకు చాలా సౌకర్యంగా మారిందని పేర్కొన్నారు.

వీసాతో పాటు భారత్-ఆస్ట్రేలియా మధ్య విమాన కనెక్టివిటీ కూడా భారీగా పెరిగింది. కరోనాకు ముందు వారానికి కేవలం 8 విమానాలు మాత్రమే ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 27కు చేరింది. అంతేకాకుండా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఆస్ట్రేలియన్ డాలర్ మారకం రేటు స్థిరంగా (సుమారు రూ. 55-56) ఉండటం కూడా సానుకూల అంశమని కాశికర్ అన్నారు. సిడ్నీ, మెల్‌బోర్న్ వంటి నగరాలతో పాటు ఇప్పుడు టాస్మానియా, కంగారూ ఐలాండ్ వంటి కొత్త ప్రదేశాలను చూసేందుకు కూడా భారత పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారని ఆయన తెలిపారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *