చైనాలో వరదల బీభత్సం.. పలు ప్రావిన్సులకు హై అలర్ట్

V. Sai Krishna Reddy
1 Min Read

చైనాలో భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దేశంలోని వాయవ్య, నైరుతి ప్రాంతాల్లో కుండపోతగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. వరద సంబంధిత ఘటనల్లో ఇప్పటివరకు ఆరుగురు మరణించారని అధికారులు ధృవీకరించారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం పలు ప్రావిన్సులలో లెవెల్-4 అత్యవసర పరిస్థితిని ప్రకటించి సహాయక చర్యలు ముమ్మరం చేసింది.

గుయిజౌ ప్రావిన్సులోని రోంగ్‌జియాంగ్ కౌంటీలో వరదల కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ వారం వ్యవధిలోనే రెండుసార్లు తీవ్రమైన వరదలు సంభవించాయి. స్థానికంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ‘విలేజ్ సూపర్ లీగ్’ (కున్ చావో) ఫుట్‌బాల్ స్టేడియం సైతం ఐదు రోజుల్లో రెండుసార్లు నీట మునిగింది.

చైనా జలవనరుల మంత్రిత్వ శాఖ గురువారం క్విన్‌ఘై ప్రావిన్సులో కొత్తగా లెవెల్-4 ఎమర్జెన్సీని ప్రకటించింది. రాబోయే మూడు రోజుల పాటు ఈ ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని, దీనివల్ల ఎల్లో రివర్ ఉపనదుల్లో నీటిమట్టం గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే సిచువాన్, గాన్సు, చాంగ్‌కింగ్ ప్రావిన్సులలో లెవెల్-4 హెచ్చరికలు అమలులో ఉన్నాయి.

వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ నదీ తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సిచువాన్‌లోని చెంగ్డు నగరంలో కొండచరియలు విరిగిపడటంతో పలు మార్గాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వీటితో పాటు మరో 10 ప్రావిన్సులకు కూడా భారీ వర్ష సూచన హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చైనాలో విపత్తుల తీవ్రతను బట్టి నాలుగు స్థాయిలలో హెచ్చరికలు జారీ చేస్తారు. ఇందులో లెవెల్-1 అత్యంత తీవ్రమైనది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *