కుమారుడి మరణ వార్త విని బైక్‌పై బయలుదేరిన తండ్రి.. రోడ్డు ప్రమాదంలో మృతి

V. Sai Krishna Reddy
1 Min Read

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కరెంట్ షాక్‌కు గురై మూడేళ్ల కుమారుడు మరణించగా, ఆ వార్త విని బైక్‌పై ఆసుపత్రికి బయలుదేరిన తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. నిమిషాల వ్యవధిలో తండ్రీ కుమారులు మరణించడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉన్నావ్ జిల్లా పరిధిలోని రసూలాబాద్ గ్రామానికి చెందిన విష్ణు కుమార్ జైస్వాల్ కుమారుడు మూడేళ్ల ఆయాన్ష్ జైస్వాల్ నిన్న ఇంట్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు బాలుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయాన్ష్ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

కుమారుడి మరణవార్త విన్న తండ్రి విష్ణు కుమార్ జైస్వాల్ వెంటనే తన మోటార్‌సైకిల్‌పై స్వగ్రామం రసూలాబాద్‌కు బయలుదేరాడు. మార్గమధ్యంలో ఉన్నావ్ జిల్లాలోనే ఆయన ప్రయాణిస్తున్న బైక్‌ను గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విష్ణు కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

గంటల వ్యవధిలోనే తండ్రీకొడుకులు మరణించడంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విష్ణు కుమార్ మృతికి కారణమైన గుర్తు తెలియని వాహనం, దాని డ్రైవర్ కోసం గాలిస్తున్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *