టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష సాధించాలనే ఉద్దేశం లేదని, అయితే చట్టాన్ని ఉల్లంఘించి తప్పు చేసిన వారు ఎంతటి వారైనా, చివరికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అయినా సరే, చట్టపరమైన చర్యలు ఎదుర్కోక తప్పదని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. సాక్ష్యాధారాలు లభిస్తే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన తేల్చిచెప్పారు.
న్యూఢిల్లీలో నిన్న మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన లోకేశ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. “కక్ష సాధించాలనుకుంటే జగన్ను జైలుకు పంపడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు రెండు నిమిషాల పని. కానీ, ఎవరిపైనా కక్ష సాధించే ఉద్దేశం తమకు లేదని ఆయనే స్వయంగా చెప్పారు” అని లోకేశ్ గుర్తుచేశారు. తాము పూర్తిగా చట్టబద్ధమైన ప్రక్రియనే అనుసరిస్తామని, జగన్పై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి తమకు ఎవరి అనుమతి అవసరం లేదని అన్నారు. చట్టాన్ని అమలు చేయడానికి అనుమతులు ఎందుకని ప్రశ్నించారు.
గతంలో మద్యం కేసును ప్రారంభించినప్పుడు రకరకాల ఆరోపణలు వచ్చాయని, డబ్బులు తీసుకున్నారని, కొందరిపై చర్యలు తీసుకోలేదని అన్నారని, కానీ చట్ట ప్రక్రియలు ఎక్కడా ఆగలేదని లోకేశ్ తెలిపారు. తమ లీగల్ టీమ్ చాలా బలంగా ఉందని, ఒకటి రెండు సందర్భాలు మినహా నేరం చేసిన వారెవరూ బెయిల్పై బయటకు రాలేకపోతున్నారని గుర్తుచేశారు.
అదే సమయంలో, అందరినీ అరెస్టు చేయాలనే అతి అంచనాలు సరికాదని లోకేశ్ హితవు పలికారు. “ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నది ఎవరో ఒకరిని జైల్లో వేయడానికి కాదు. పరిపాలించడానికి, సంక్షేమం, అభివృద్ధి చేయడానికే అధికారం ఇచ్చారు. కానీ, చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించిన వారిని, శాంతిభద్రతలను చేతుల్లోకి తీసుకున్న వారిని వదిలిపెట్టబోమని ఎన్నికల్లోనే వాగ్దానం చేశాను” అని ఆయన పేర్కొన్నారు.
“జగన్మోహన్రెడ్డిని జైల్లో పెడతామని మేమేమైనా మేనిఫెస్టోలో చెప్పామా? సూపర్ సిక్స్ వాగ్దానాల్లో ఉందా? మమ్మల్ని రఫ్ఫాడిస్తామన్న ప్రగల్భాలకు విలువ లేదు. జగన్ చేసిన నేరాలను మేం విస్మరించలేదు, అలాగని ఆయన చుట్టూనే తిరగాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి వేరే ప్రాధాన్యాలుంటాయి” అని లోకేశ్ వ్యాఖ్యానించారు. మద్యం కేసులో తాను రూపాయి కూడా అక్రమంగా సంపాదించలేదని జగన్ దేవుడి ముందు ప్రమాణం చేస్తారా? తన చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసులో తమ కుటుంబ సభ్యులకు పాత్ర లేదని ప్రమాణం చేస్తారా? అని లోకేశ్ సవాల్ విసిరారు. డబ్బులిచ్చాం కనుక ఓట్లు పడతాయన్న భ్రమలు తమకు లేవని, ప్రజలతో భావోద్వేగ సంబంధాలున్నప్పుడే వారు తమతో ఉంటారని అన్నారు.
తమ ప్రభుత్వంలో అంతిమ నిర్ణయం తమ అధినేత చంద్రబాబుదేనని, తమకు ఎలాంటి హైకమాండ్ లేదని లోకేశ్ స్పష్టం చేశారు. కేసీఆర్ తమ ఫోన్లు ట్యాప్ చేయించారన్న వార్తలపై స్పందిస్తూ, దానిపై అధ్యయనం చేయాల్సి ఉందని తెలిపారు. మద్యం కేసుతో పాటు మరిన్ని అక్రమాలపై కేసులు కొనసాగుతాయని, లిక్కర్ కేసులో త్వరలోనే చార్జిషీటు వేస్తారని వెల్లడించారు. ఈ కేసులో జనం మరణించారన్నది ప్రధాన ఆరోపణ కాగా, మనీలాండరింగ్ నేరాలు కూడా ఉన్నాయని వివరించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తాము ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదన్నారు.
కేవలం ఏడాది పాలనలోనే ఎన్నో సాధించామని, పెట్టుబడులు పెంచడం ద్వారా సంపదను సృష్టించే దిశగా పయనిస్తున్నామని లోకేశ్ తెలిపారు. పాఠశాల విద్యలో ఆంధ్రప్రదేశ్ సాధించిన విజయాలపై చర్చించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రెండు రోజులు సమయం కేటాయిస్తానని చెప్పారన్నారు. బటన్ నొక్కకుండానే వేల కోట్ల రూపాయల ప్రయోజనాలను ప్రజలకు అందించామని, అయినా తమకు పాలాభిషేకాలు అవసరం లేదని వ్యాఖ్యానించారు. కార్యకర్తలు పార్టీ నాయకత్వంపై నిరుత్సాహంగా ఉన్నారన్నది అవాస్తవమని, మొదటి నుంచీ కార్యకర్తలకు, ఉద్యోగుల బదిలీలకు సంబంధం లేదని, ఉపాధ్యాయుల బదిలీల్లో కూడా రాజకీయ ప్రమేయం ఉండబోదని లోకేశ్ హామీ ఇచ్చారు.