ఒకే ఒక్కడు… విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు

V. Sai Krishna Reddy
2 Min Read

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. లండన్‌లోని గాట్విక్ నగరానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది. ఈ దుర్ఘటనలో పలువురు మరణించి ఉంటారని ఆందోళన వ్యక్తమవుతుండగా, అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కానీ, ఇదే విమానంలో ప్రయాణిస్తున్న అతడి సోదరుడు ఆచూకీ మాత్రం ఇంకా తెలియరాలేదు.

టేకాఫ్ అయిన 30 సెకన్లకే…!

వివరాల్లోకి వెళితే, ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం, 230 మంది ప్రయాణికులు మరియు 12 మంది సిబ్బందితో కలిపి మొత్తం 242 మందితో గురువారం మధ్యాహ్నం 1:39 గంటలకు అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి గాట్విక్‌కు బయలుదేరింది. అయితే, టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానం కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ 40 ఏళ్ల విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తిని అహ్మదాబాద్‌లోని అసర్వాలో గల సివిల్ ఆసుపత్రి జనరల్ వార్డులో చేర్పించారు. అతడి ఛాతీ, కళ్లు, పాదాలకు గాయాలయ్యాయి.

“టేకాఫ్ అయిన 30 సెకన్లకే పెద్ద శబ్దం వినిపించింది, ఆ వెంటనే విమానం కూలిపోయింది. అంతా క్షణాల్లో జరిగిపోయింది,” అని విశ్వాస్ ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆ భయానక క్షణాలను గుర్తుచేసుకున్నారు. “నేను స్పృహలోకి వచ్చి చూసేసరికి నా చుట్టూ మృతదేహాలున్నాయి. భయంతో వణికిపోయాను. వెంటనే లేచి పరిగెత్తాను. విమాన శకలాలు అక్కడక్కడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఎవరో నన్ను పట్టుకుని అంబులెన్స్‌లో ఎక్కించి ఇక్కడికి తీసుకొచ్చారు” అని ఆయన తెలిపారు. తన వద్ద ఇంకా బోర్డింగ్ పాస్ ఉందని కూడా విశ్వాస్ చూపించారు.

సోదరుడి కోసం ఆవేదన

బ్రిటిష్ పౌరుడైన విశ్వాస్, గత 20 ఏళ్లుగా లండన్‌లో నివసిస్తున్నారు. అతడి భార్య, పిల్లలు కూడా లండన్‌లోనే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం కుటుంబ సభ్యులను కలిసేందుకు భారత్‌కు వచ్చిన ఆయన, తన సోదరుడు అజయ్ కుమార్ రమేష్ (45)తో కలిసి తిరిగి యునైటెడ్ కింగ్‌డమ్‌కు పయనమయ్యారు. “మేమిద్దరం డయ్యు వెళ్ళొచ్చాం. తను కూడా నాతోపాటే ప్రయాణిస్తున్నాడు, కానీ విమానంలో వేరే వరుసలో కూర్చున్నాడు. ఇప్పుడు అజయ్ కనిపించడం లేదు. దయచేసి అతడిని కనుక్కోవడంలో సహాయం చేయండి” అని విశ్వాస్ కన్నీటిపర్యంతమయ్యారు.

ఎయిర్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం, విమానంలోని 230 మంది ప్రయాణికులలో 169 మంది భారతీయ పౌరులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు, ఒక కెనడియన్ ఉన్నారు.

ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి వద్ద విషాదకర వాతావరణం నెలకొంది. తమ ఆత్మీయుల క్షేమ సమాచారం కోసం బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళనతో ఎదురుచూస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *