మానవతా దృక్పథంతో రోగులకు సేవలందించాలి

Karimnagar Bureau
3 Min Read

మానవతా దృక్పథంతో రోగులకు సేవలందించాలి

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలి

టీఫా స్కాన్ మిషన్ కొనుగోలు అంశాన్ని పరిశీలించాలి

హుజురాబాద్ ఆసుపత్రిలో ఆరోగ్య మహిళ వెంటనే ప్రారంభించాలి

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

హుజూరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సందర్శన

కరీంనగర్ బ్యూరో, జూన్ 04, (ప్రజాజ్యోతి)
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మానవతా దృక్పథంతో సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ బుధవారం సందర్శించారు. డయాలసిస్ కేంద్రం, ఐసీయూ, వార్డులు, ఓపి విభాగం సందర్శించారు. నవజాత శిశువుల వార్డు సందర్శించి పిల్లలకి వచ్చిన సమస్యల గురించి తెలుసుకున్నారు. లేబర్ రూమ్, వార్డులు పరిశీలించి గర్భిణీ బాలింతలతో మాట్లాడారు. ఆస్పత్రి సిబ్బంది వారికి అందిస్తున్న సేవలను గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తల్లిపాల ప్రాముఖ్యతను, సాధారణ ప్రసవం ప్రాధాన్యతను అక్కడి మహిళలకు వివరించారు. ఇతర వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడారు.
అనంతరం ఆస్పత్రిలోని కాన్ఫరెన్స్ హాల్లో వైద్యాధికారులు, మెడికల్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ఆస్పత్రిలో అన్ని రకాల సేవలందించేందుకు అవసరమైన సిబ్బంది ఖాళీల వివరాలు సమర్పించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని, సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు ముందస్తు జాగ్రత్తలు సూచించాలని, వైద్య సహాయం అవసరం అనుకుంటే గర్భిణీలను ప్రసవ గడువు కంటే ముందే ఆస్పత్రిలో చేర్చుకోవాలని అన్నారు. ఆప్తమాలజిస్ట్, రేడియాలజిస్ట్, డెంటిస్ట్ వంటి విభాగాల వారీగా ఓపి సంఖ్యను పరిశీలించారు. నెలవారి నివేదికలను సమీక్షించారు. రోగుల పట్ల మానవీయకోణంలో వ్యవహరించి వారికి సేవలు అందించాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ప్రైవేట్ దుకాణాల్లో వేల రూపాయలు ఖర్చుతో కొనుగోలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా బీపీ, షుగర్ సంబంధిత మందులు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నప్పటికీ ప్రైవేటులో కొనుగోలు చేయడం దురదృష్టకరమని అన్నారు. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించి ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఉచితంగా మందులు తీసుకునేలా చూడాలని సూచించారు. నవజాత శిశువులు, పిల్లల సేవల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య మహిళ క్యాంపును వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. మెప్మా, ఐకెపి సిబ్బంది ద్వారా ఆరోగ్య మహిళ ఉచిత వైద్య పరీక్షల పట్ల మహిళలకు అవగాహన కల్పించి క్యాంపును సద్వినియోగం చేసుకునేలా చూడాలని తెలిపారు. ఈ క్యాంప్ ద్వారా సుమారు 50 వేల రూపాయల ఖరీదు చేసే 47 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్న విషయం మహిళల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన మహిళలకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి బీపీ షుగర్ థైరాయిడ్ వంటి మందులను అందించాలని అన్నారు. 108 సేవలకు ఎటువంటి అంతరాయం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. అవసరమైన సౌకర్యాలు సమకూర్చుకోవాలని ఆదేశించారు.అంతకుముందు ఆసుపత్రి ఆవరణలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ మొక్కలు నాటారు.ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, డి సి హెచ్ చంద్రశేఖర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ నారాయణరెడ్డి, ఆర్ఎంవో రమేష్, సూపరింటెండెంట్ శ్రీకాంత్ రెడ్డి, డిప్యూటీ డిఎంహెచ్వో చందు, ఆర్డీవో రమేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *