గంజాయి విక్రేత అరెస్ట్ – 1.2 కిలోల గంజాయి స్వాధీనం

Karimnagar Bureau
2 Min Read

గంజాయి విక్రేత అరెస్ట్ – 1.2 కిలోల గంజాయి స్వాధీనం

కరీంనగర్ క్రైమ్, జూన్ 3, (ప్రజాజ్యోతి)

కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మరియు కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్ గార్ల ఆదేశాల మేరకు, ఎస్‌ఐ కొత్తపల్లి సాంబమూర్తి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బృందం ఈరోజు మధ్యాహ్నం బావుపేట గ్రామంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో గంజాయి విక్రేతను అరెస్టు చేసి, అతని వద్ద నుండి 1.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.వివరాల్లోకి వెళితే, బావుపేట గ్రామంలోని రాంరెడ్డి చికెన్ సెంటర్ ఎదుట ఒక వ్యక్తి నల్లని పాలిథిన్ కవర్‌తో పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా, పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతని చేతిలోని కవర్‌ను తనిఖీ చేయగా, అందులో గంజాయి వాసన కలిగిన పువ్వులు, మొగ్గలు లభించాయి. విచారణలో నిందితుడు తన పేరు రాంపర్వేష్ సాయిని (46), బీహార్ రాష్ట్రానికి చెందిన వాడినని తెలిపాడు. గత కొంతకాలంగా కూలీ పని నిమిత్తం బీహార్ నుండి బావుపేట గ్రామానికి వచ్చి గ్రానైట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు పేర్కొన్నాడు.ఇక్కడ గంజాయి అలవాటు ఉన్నవారికి గంజాయిని విక్రయించి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో బీహార్ వెళ్లి అక్కడ గుర్తు తెలియని వ్యక్తి వద్ద తక్కువ ధరకు గంజాయి కొని, ఇక్కడికి తీసుకువచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి ఒక్కో ప్యాకెట్‌ను రూ. 500 చొప్పున అమ్ముతున్నట్లు ఒప్పుకున్నాడు. మంగళవారం

కూడా ఎవరికైనా అమ్మాలని అక్కడే నిలబడి ఉన్నట్లు తెలిపాడు.వెంటనే ఎస్‌ఐ సాంబమూర్తి ఇద్దరు ప్రభుత్వ పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి, నిందితుడి వద్ద ఉన్న గంజాయిని తూకం వేయగా సుమారు 1 కిలో 200 గ్రాముల గంజాయి ఉన్నట్లు తేలింది. స్వాధీనం చేసుకున్న గంజాయిని, నిందితుడి వద్ద ఉన్న సెల్ ఫోన్‌ను స్వాధీన పరుచుకొని, నిందితుడు రాంపర్వేష్ సాయినిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి, తదుపరి చర్యల నిమిత్తం కోర్టుకు రిమాండ్ తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ గంజాయి పట్టుబడటంలో కీలకంగా వ్యవహరించిన సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్‌ఐ సాంబమూర్తి, సిబ్బందిని సీపీ గౌస్ ఆలం, ఏసీపీ శుభం ప్రకాష్  అభినందించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *