పాకిస్థాన్ ఒక విఫల రాజ్యం.. అది ఉగ్రవాదానికి అడ్డా.. బహ్రెయిన్‌లో ఎంపీ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు

V. Sai Krishna Reddy
2 Min Read

ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్‌ను ఒక ‘విఫల రాజ్యం’గా అభివర్ణిస్తూ, ఆ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలోని భారత అఖిలపక్ష బృందం నిన్న బహ్రెయిన్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా అక్కడి ప్రముఖులతో జరిగిన సమావేశంలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.

“గత కొన్నేళ్లుగా భారత్ ఎదుర్కొంటున్న ఉగ్రవాద ముప్పు గురించి ప్రపంచానికి తెలియజేయడానికే మా ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడికి పంపింది. దురదృష్టవశాత్తు ఈ ఉగ్రవాదం వల్ల మేం ఎంతోమంది అమాయకుల ప్రాణాలను కోల్పోయాం. ఈ సమస్యకు పాకిస్థాన్ మూల కారణం. ఆ దేశం ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడం, నిధులు సమకూర్చడం ఆపేంత వరకు ఈ సమస్య పరిష్కారం కాదు” అని ఒవైసీ స్పష్టం చేశారు.

ప్రతి భారతీయుడి ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని ఒవైసీ తెలిపారు. “పాకిస్థాన్ మరోసారి ఇలాంటి దుస్సాహసానికి పాల్పడితే వారు ఊహించని దానికంటే తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుంది” అని హెచ్చరించారు. తీవ్రమైన కవ్వింపు చర్యలు ఎదురైనా భారత్ ఎప్పుడూ సంయమనం పాటిస్తూ వస్తోందని గుర్తుచేశారు. పహల్గామ్ దాడిని ప్రస్తావిస్తూ ఉగ్రవాదం సృష్టిస్తున్న మానవ విషాదాన్ని ఆయన వివరించారు. “ఆరు రోజుల క్రితం పెళ్లయిన మహిళ ఏడో రోజే వితంతువుగా మారింది. రెండు నెలల క్రితం వివాహమైన మరో మహిళ కూడా ఈ దాడిలో తన భర్తను కోల్పోయింది” అని ఆవేదన వ్యక్తం చేశారు. “మా రాజకీయ అభిప్రాయాలు వేరైనా, దేశ సమగ్రత విషయంలో మేమంతా ఒక్కటే. ఈ విషయాన్ని మా పొరుగు దేశం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి” అని ఒవైసీ అన్నారు.

భారతదేశానికి తన పౌరులనే కాకుండా, దేశంలో నివసించే ప్రతి ఒక్కరి భద్రతను కాపాడటానికి కావలసిన శక్తిసామర్థ్యాలున్నాయని ఒవైసీ నొక్కిచెప్పారు. “పాకిస్థాన్ లాంటి విఫల రాజ్యం నుంచి వస్తున్న అన్ని రకాల ముప్పులను మన వాయు రక్షణ వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానం సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి” అని ఆయన తెలిపారు. ఉగ్రవాదానికి అందుతున్న నిధులను అరికట్టేందుకు అంతర్జాతీయ సహకారం చాలా అవసరమని ఒవైసీ పేర్కొన్నారు.

బైజయంత్ పాండా నేతృత్వంలోని ఈ ప్రతినిధి బృందంలో ఒవైసీతో పాటు గులాం నబీ ఆజాద్, బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, ఫాంగ్నాన్ కొన్యాక్, ఎన్‌జేపీ ఎంపీ రేఖా శర్మ, ఎంపీ సత్నామ్ సింగ్ సంధు, రాయబారి హర్ష్ ష్రింగ్లా తదితరులు ఉన్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ స్పందన, సీమాంతర ఉగ్రవాదంపై దేశం సాగిస్తున్న పోరాటం గురించి అంతర్జాతీయ భాగస్వాములకు వివరించడమే ఈ బృందం పర్యటన ముఖ్య ఉద్దేశం. ఈ బృందం సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియా దేశాల్లో పర్యటించనుంది. ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని స్పష్టం చేయడం, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడం ఈ పర్యటన లక్ష్యాల్లో భాగం

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *