పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్పై భారత్ మండిపడుతోంది. ఈ దాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. అనేక దేశాలు భారత్కు మద్దతుగా నిలిచాయి.
పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తుండటంతో భారత్ నుంచి ఎదురయ్యే ప్రతిఘటనపై పాకిస్థాన్ ఆందోళన చెందుతోంది. పైకి ధీమాగా ఉన్నట్లు కనిపించినా, భారత్ చర్యలపై భయంతో రక్షణ కోసం పాక్ ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలో పాకిస్థాన్ ప్రభుత్వం ప్రపంచ సహాయం కోరుతోంది. ఇప్పటికే చైనా, రష్యాలను అభ్యర్థించింది. ఈ దాడిపై నిష్పక్షపాత విచారణకు సహకరిస్తామని పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ఘర్షణను తగ్గించాలని కోరారు. ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రస్తో మాట్లాడిన పాక్ ప్రధాని ఉద్రిక్తతలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్పై ఒత్తిడి తీసుకురావాలని అరేబియా, యూఏఈతో సహా ఇతర గల్ఫ్ దేశాధినేతలను పాక్ ప్రధాని కోరారు. పాకిస్థాన్లోని సౌదీ రాయబారి నవాఫ్ బిన్ సయిద్ అల్ మాలికితో సమావేశంలో దక్షిణాసియాలో శాంతి, స్థిరత్వం కోసం పాకిస్థాన్ కృషి చేస్తుందని పాక్ ప్రధాని పునరుద్ఘాటించారని పీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది.
పాకిస్థాన్లోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి హమర్ ఒబైద్ ఇబ్రహీం అల్ జాబీతో కూడా పాక్ ప్రధాని సమావేశమయ్యారు. కువైట్ రాయబారి నాసన్ రెహ్మన్ జాసన్ను కూడా పాక్ ప్రధాని కలిసి విజ్ఞప్తి చేశారు.