జమ్ముకశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి భారత్ తో పాటు ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ భీకర ఉగ్రదాడిలో 26మంది పౌరులు మరణించారు. ఈ సమయంలో ఈ దాడిని భారత్ అత్యంత తీవ్రంగా పరిగణించింది. పాక్ కు దిమ్మతిరిగేలా.. ఇప్పట్లో కోలుకోలేని రీతిలో షాకిచ్చే నిర్ణయాలు తీసుకుంది!
పెహల్గాం ఉగ్రదాడిపై సుదీర్ఘంగా చర్చించిన భద్రతపై కేబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశంలో.. పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా… తాజా ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని పేర్కొన్న కేంద్రం 5 ప్రధాన ప్రకటనలు చేసింది. ఇందులో పాకిస్థాన్ ను త్వరలో ఎడారిగా మార్చే కీలక నిర్ణయం కూడా ఉంది.
అవును… పెహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని ప్రకటించిన కేంద్రం ఐదు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగగ్మా… వాఘా సరిహద్దు మూసివేత.. పాక్ పౌరులకు భారత్ లోకి ప్రవేశం నిషేధం.. సైనిక సలహాదారుల బహిష్కరణ.. హైకమిషన్ సిబ్బంది సంఖ్య తగ్గింపు కాగా.. మరో అత్యంత కీలక నిర్ణయం.. సింధూ జలాల సహకారాన్ని నిలిపేయడం! వాస్తవానికి పాక్ గతంలో భారత్ పై ఎన్నోసార్లు ఉగ్రదాడి చేసింది! అయితే… ఈ చర్యలపై భారత్ పలుమార్లు శాంతి మంత్రం జపించగా.. అనంతరం కొన్ని ప్రతిదాడులు చేసింది! అంతేకానీ సాధారణ ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశ్యంతో సింధూ నదీ జలాల జోలికి వెళ్లలేదు. కానీ… ఇప్పుడు వెళ్లింది.
తాజాగా పహల్గం ఘటన తర్వాత పాక్ కు దిమ్మతిరే షాక్ ఇచ్చింది భారత్. ఇందులో భాగంగా సింధూ జలాల సహకారాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో.. త్వరలో పాకిస్థాన్ ఎడారిగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. కారణం.. ఈ జలాలపైనే ఆ దేశంలోని పలు రాష్ట్రాలు ఆధారపడి ఉన్నాయి. ఏమిటీ సింధు జలాల ఒప్పందం?: 1960 సెప్టెంబర్ 19న అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ల మధ్య ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో భాగంగా సింధు నదీ జలాలపై ఓ ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా… భారత్ కి తూర్పు నదులు రావి, సట్లేజ్, బియాస్ లపైనా… పాకిస్థాన్ కు పడమర నదులైన సింధు, జీలం, చినాబ్ నదులపైనా నియంత్రణ ఉంటుంది.
దీంతో.. భారత్ లో ఉన్న సింధు నదుల వ్యవస్థ ద్వారా ప్రవహించే మొత్తం నీటిలో భారత్ సుమారు 30% పొందగా.. మిగిలిన 70%పాక్ కు లభించింది! అయితే.. ఈ ఒప్పందం పశ్చిమ నదుల నీటితో విద్యుత్ ఉత్పత్తి, చేపల పెంపకం మొదలైన ఉపయోగాల కోసం ఉపయోగించుకోవడానికి అనుమతిస్తుంది. ఈ నేపథ్యంలో.. ఈ ఒప్పందం వల్ల భారత్ కంటే ఎక్కువగా పాకిస్థాన్ లబ్ధి పొందుతుందనే వాదన ఉంది. ఈ క్రమంలో… 2016లో ఉరి ఉగ్రదాడి అనంతరం స్పందించిన ప్రధాని మోడీ… రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని వ్యాఖ్యానించారు. తర్వాత 2023లో నాటి ఒప్పందంపై మరోసారి చర్చించాల్సిందిగా పాక్ కు తెలియజేశారు. అయితే.. పాక్ మాత్రం 1960 నాటి ఒప్పందానికే కట్టుబడి ఉండాలని కోరింది. ఈ నేపథ్యంలో తాజా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో.. భారత్ నుంచి వెళ్లే జలాలు అందక.. పాకిస్థాన్ ఎడారిగా మారడం ఖాయం అని అంటున్నారు. కాగా… ప్రపంచంలో అతి తక్కువ నీటి వనరులున్న దేశాల్లో ఒకటైన పాక్ కు సింధు నదీ జలాలే ప్రధాన వనరు.