అన్నదాతకు రేవంత్ సర్కార్ తీపి కబురు

V. Sai Krishna Reddy
2 Min Read

తెలంగాణ రైతులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యాయి. వరి కోతలు ఊపందుకోవడంతో ఇప్పటివరకు వెయ్యికి పైగా కొనుగోలు కేంద్రాలు తెరిచారు. రానున్న రోజుల్లో కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే మొత్తం 8 వేల కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈసారి 56.69 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. దీని ద్వారా 90 లక్షల తన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నారు. సన్న, దొడ్డు ధాన్యం కొనుగోలు చేయడానికి వేర్వేరు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వస్తున్న ధాన్యంలో దాదాపు 95 శాతం సన్న రకాలే ఉన్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు 15,354 టన్నుల కొనుగోళ్లు జరిగాయి. అందులో 14,599 టన్నులు సన్న రకాలు కాగా, దొడ్డు రకం కేవలం 755 టన్నులు మాత్రమే ఉన్నాయి. కొన్న ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు పంపిస్తున్నారు. ఈ రబీ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 70.13 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో దొడ్డు రకం 46.71 లక్షల టన్నులు, సన్న రకాలు 23.42 లక్షల టన్నులు ఉన్నాయి. అంటే దాదాపుగా దొడ్డు రకాలు 66 శాతం, సన్నాలు 34 శాతం సాగు చేశారు. సన్న ధాన్యానికి గత ఖరీఫ్‌లో క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చారు. ఇప్పుడు రబీ సీజన్‌లో కూడా అదే బోనస్ ఇస్తున్నారు. గ్రేడ్ ‘ఎ’ రకానికి ప్రభుత్వం మద్దతు ధర క్వింటాకు రూ.2,320 ఇస్తోంది. దీనికి అదనంగా బోనస్ రూ.500 కలిపి మొత్తం రూ.2,820 చెల్లిస్తారు. గతంలో మిల్లర్లు, వ్యాపారులు దీనికంటే ఎక్కువ ధర ఇచ్చారు. కానీ ఇప్పుడు అంత ఎక్కువ ధర ఇవ్వడం లేదు. అందుకే రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కొనుగోలు చేసిన 15,354 టన్నుల ధాన్యానికి రూ.35.62 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు రైతులకు రూ.5.78 కోట్లు చెల్లించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *