రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పలు పరీక్షల తేదీలను వెల్లడించింది. ఈ మేరకు అధికారిక వెబ్సైట్లో షెడ్యూల్ విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం పారా-మెడికల్ పరీక్ష (సీబీటీ) ఏప్రిల్ 28 నుంచి 30 వరకు జరగనున్నాయి. మొత్తం 3 రోజుల్లో ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఎగ్జాం సిటీ ఇంటిమేషన్ స్లిప్లు పరీక్షకు పది రోజుల ముందు విడుదల చేస్తారు. ఇక అడ్మిట్ కార్డులు పరీక్షకు నాలుగు రోజుల ముందు వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకువస్తారు. కాగా భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు… దేశ వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో పారా-మెడికల్ ఖాళీల భర్తీకి సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటీసు నంబర్ 04/2024 నోటిఫికేషన్ను గత ఏడాది జారీ చేసిన విషయం తెలిసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రైల్వే రీజియన్లలో మొత్తం 1376 పారా మెడికల్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.