బంగారం ధర పెరిగింది కదా అని గోల్డ్ లోన్లు తీసుకుంటున్నారా? ఒక్క నిమషం ఆగండి. గోల్డ్ లోన్ తీసుకోవడం ఇక నుంచి అంత ఈజీ కాదు. ఇలా బంగారం తాకట్టు పెట్టి అలా లోన్ తీసుకోవడం కుదరదు. బంగారం ఎవరిదో ఆధారాలు చూపాలి. లోన్ ఎందుకో కచ్చితమైన కారణాలు చెప్పాలి. బంగారం అంటే కేవలం అలంకార ప్రియం మాత్రమే కాదు.. ఆర్ధికంగా ఆదుకునే భరోసా కూడా. సామాన్యుల నమ్మకం ఇదే. కష్టం వస్తే గోల్డ్ లోన్తో గట్టెక్క వచ్చు అనుకునే వాళ్లకు గడ్డు కాలం రాబోతుంది. భద్రం అని బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెడితే..బ్యాంకు సిబ్బంది చేతివాటంతో అసలుకే ఎసరు వస్తోంది. కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారాన్ని దారి మళ్లిస్తూ మోసాలకు పాల్పడిన బ్యాంకు సిబ్బంది వైనాలు ఇటీవల సంచలనం రేపాయి. మరోవైపు దేశవ్యాప్తంగా గోల్డ్ లోన్స్ అడ్డగోలుగా పెరుగుతోన్న క్రమంలో వీటన్నింటికీ కళ్లెం వేసేందుకు నిబంధనలను మరింత కఠినతరం చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) చర్యలు చేపట్టబోతుంది. ఏ బ్యాంక్కు వెళ్లినా..ఏ ఫైనాన్షియల్ ఆఫీస్కు వెళ్లినా గంటలో అరగంటలో గోల్డ్లోన్ ఇవ్వబడును అని తాటికాయంత అక్షరాలతో ఆకర్షణీయపై ప్రకటనలు కన్పిస్తాయి. లోన్ మంజూరు కావాలంటే అప్రయిజర్లే కింగ్ మేకర్లు. బంగారాన్ని పరీక్షించి.. తూకం వేసి ఎంత రుణం ఇవ్వాలో నిర్ణయిస్తారు. అక్కడే మోసాలకు తెరలేస్తోంది. పైకం కొద్దీ లోన్ మంజరు చేయడం.. కొన్ని సార్లు గిల్టు నగలను తాకట్టు పెట్టి బ్యాంక్లను బురిడీ కొట్టించడం వంటి మోసాలు కొకొల్లుగా జరిగాయి. జరుగుతున్నాయి. ఇట్టాంటి వాటిని కట్టడి చేసేందుకు ఆర్బీఐ కొరడా ఝులిపించబోతుంది. లోన్ తీసుకునేది ఎవరు? తాకట్టు పెట్టే బంగారం వారిదేనా? అని ఆరా తీయడం సహా అందుకు సంబంధించిన ఆధారాలను విధిగా సమర్పించాలనే నిబంధన తీసుకురాబోతుంది ఆర్బీఐ.
గోల్డ్ లోన్ జారీ చేయాలంటే తాకట్టు బంగారం తమదేనని వినియోగదారులు కంపల్సరీగా ఆధారాలు ఇవ్వాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ సహా కస్టమర్ల బ్యాంక్ గ్రౌండ్ను వెరీఫై చేసుకున్నాకే రుణాలు ఇవ్వాలని బ్యాంక్లకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేయబోతుందని తెలుస్తోంది.