మార్గదర్శిపై విచారణ జరగాల్సిందేనని ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు చేసింది. మార్గదర్శి కేసుపై నిన్న తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాఖలైన కేసును కొట్టివేయాలని కోరుతూ మార్గదర్శి దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ శ్యాంకోషీ, జస్టిస్ సుజన ధర్మాసనం విచారణ జరిపింది.
విచారణ సందర్భంగా ఆర్బీఐ తరపున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ తన వాదనలు వినిపిస్తూ… రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంలోని 45 (ఎస్)కు విరుద్ధంగా మార్గదర్శి ప్రజల నుంచి డిపాజిట్లను సేకరించిందని పేర్కొన్నారు. కేసును మార్గదర్శి ఎదుర్కోవాల్సిందేనని ఆయన వాదించారు. రామోజీరావు మరణించినప్పటికీ కేసు విచారణ కొనసాగాలని అన్నారు. ఒకవేళ తప్పు జరిగినట్టు తేలితే… సెక్షన్ 58 (బీ) ప్రకారం మార్గదర్శి శిక్షను ఎదుర్కోవాలని పేర్కొన్నారు.
మార్గదర్శి తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ… ఇందులో కర్త, కర్మ, క్రియ అన్నీ రామోజీరావేనని, ఆయన చనిపోయిన నేపథ్యంలో ఇక ఎవరిపైనా కేసు ఉండదని తెలిపారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ… రామోజీరావు చనిపోయిన నేపథ్యంలో, ఇప్పుడు కేసు విచారణ చేపట్టడం వల్ల సమయం వృథా తప్ప మరేమీ ఉండదని స్పష్టం చేశారు. వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్ వేసిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పూర్తి స్థాయి వాదనల కోసం మార్చి 7కు తదుపరి విచారణను వాయిదా వేసింది