ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం డ్రోన్లు, ఎండోస్కోపిక్ కెమెరాలు, వాకీటాకీ వంటి సిగ్నల్ పరికరాలతో సహాయక సిబ్బంది సొరంగం లోనికి వెళ్లింది. సొరంగంలో సుమారు 200 మీటర్ల మేర బురద పేరుకుపోయింది. బురదతో పాటు నీళ్లు నిలిచి ఉండటంతో బృందాలు ముందుకు వెళ్లలేకపోతున్నాయి. సొరంగంలో విరిగిన భాగాలు, బురదను బయటకు తీసుకువచ్చేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నాలు చేస్తోంది.
2023లో ఉత్తరాఖండ్లో జరిగిన ప్రమాదంలో మద్రాస్ ఐఐటీ నిపుణుల బృందం 34 మందిని రక్షించింది. అత్యాధునిక టెక్నాలజీని కలిగిన ఆక్వా ఐ, ఫ్లెక్సీ ప్రోబ్ పరికరాలతో మద్రాస్ ఐఐటీ నిపుణులు సహాయక చర్యలు చేపడతారు. విశాఖకు చెందిన నేవీ బృందం కూడా రంగంలోకి దిగింది.
మరోవైపు, ఉత్తర కాశీలో సిల్క్ యారా టన్నెల్లో చిక్కుకున్న 41 మందిని రక్షించిన స్పెషలిస్టులు ఎస్ఎల్బీసీకి చేరుకున్నారు. ఇందులో మొత్తం 12 మంది ఉన్నారు. వీరిని ‘ర్యాట్ మైనర్స్’ అని పిలుస్తారు. ఇందులో ఆరుగురు ఎస్ఎల్బీసీకి చేరుకున్నారు. మరో ఆరుగురు ఢిల్లీ నుండి వస్తున్నారు. ‘ర్యాట్ మైనర్’ ఖురేషి మాట్లాడుతూ, తాము ఢిల్లీ నుండి వచ్చామని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ తమను పిలిపించాడని తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం వివరాలు తమకు పూర్తిగా తెలియవని వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అనుసరించాలని తమకు సూచనలు అందాయని తెలిపారు.