ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ల ఆకలి తీర్చే జోనర్ గా క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కనిపిస్తుంది. ఈ జోనర్ కి ఈ వైపు నుంచి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అందువలన ఎప్పటికప్పుడు భారీ వెబ్ సిరీస్ లు బరిలోకి దిగిపోతున్నాయి. విశేషమైన ఆదరణ పొందుతున్నాయి. అలాంటి ఒక వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఉంది.
క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఆ సిరీస్ పేరే ‘డబ్బా కార్టెల్’. హితేశ్ భాటియా దర్శకత్వం వహించిన సిరీస్ ఇది. షబానా ఆజ్మీ .. జ్యోతిక .. షాలినీ పాండే ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్, ఈ నెల 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ముంబై శివారుల నేపథ్యంలో నడిచే కథ ఇది. ముంబైలో డబ్బాలలో లంచ్ సప్లై చేసే బిజినెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడివాళ్లలో చాలామంది ఈ డబ్బా ఫుడ్ పై ఆధారపడుతూ ఉంటారు.
అయితే ఐదుగురు మహిళలు ఆ డబ్బాలలో డ్రగ్స్ సప్లై చేయడానికి రంగంలోకి దిగుతారు. ఈ ఐదుగురికి కూడా తమ తెలివి తేటలపై తమకి విపరీతమైన నమ్మకం ఉంటుంది. అందువలన తమని పట్టుకోవడం ఎవరి వలన కాదనే పూర్తి కాన్ఫిడెన్స్ తో బిజినెస్ మొదలెడతారు. ఫలితంగా వాళ్లకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనేది కథ. కామెడీ టచ్ తో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ కి ఏ స్థాయి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి