గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ పై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు. వంశీ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి స్థానం లేకుండా పోయిందని విమర్శించారు. తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ అరెస్టులతో అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని జగన్ సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉంది. గన్నవరం కేసులో తనపై టీడీపీ వాళ్లు ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసు పెట్టించారంటూ ఓ దళిత యువకుడు సాక్షాత్తు జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చి అధికార పార్టీ కుట్రను బట్టబయలు చేశాడు. దాంతో తమ బండారం బయటపడిందని, తమ తప్పులు బయటికి వస్తున్నాయని తట్టుకోలేక, దాన్ని కూడా మార్చేసేందుకు చంద్రబాబు దుర్మార్గాలు చేస్తున్నారు.
వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు, టీడీపీ కార్యకర్తలు వెళ్లి బెదిరించడం కరెక్టేనా? ఈ కేసు సుప్రీంకోర్టు దృష్టిలో ఉంది. సుప్రీం ఆదేశాలతో దిగువ కోర్టు ఈ కేసును విచారిస్తోంది. అలాంటప్పుడు పెట్టింది తప్పుడు కేసంటూ వాస్తవాలు బయటికి వస్తుంటే మొత్తం దర్యాప్తును, విచారణను, చివరికి జడ్జిని, న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తుండడం అధికార దుర్వినియోగం కాదా?” అంటూ జగన్ ప్రశ్నించారు.