వేల కోట్ల రూపాయల ఆస్తిని సోదరుడు జిమ్మీ టాటాతో పాటు తన సహాయకులకు వీలునామా రాసిన టాటా
మోహన్ దత్తా అనే వ్యక్తికి రూ. 500 కోట్లు రాశారంటున్న మీడియా వర్గాలు
ట్రావెల్ ఏజెన్సీని నిర్వహిస్తున్న మోహన్ దత్తా
దేశం గర్వించదగ్గ ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో యావత్ దేశం కంటతడి పెట్టింది. గొప్ప మానవతామూర్తిగా, సమాజ సేవకుడిగా పేరుగాంచిన రతన్ టాటా తనకున్న వేల కోట్ల ఆస్తిని సోదరుడు జిమ్మీ టాటాకు, తన వద్ద పని చేస్తున్న వారికి, పెంపుడు శునకాలకు కూడా వీలునామా రాశారు. తాజాగా బయటకు వచ్చిన ఆయన వీలునామా చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక రహస్య వ్యక్తికి తన ఆస్తిలో రూ. 500 కోట్లు ఇవ్వాలని వీలునామాలో ఆయన పేర్కొన్నట్టు సమాచారం.
జంషెడ్ పూర్ కు చెందిన ట్రావెల్స్ వ్యాపారి మోహన్ దత్తానే ఆ రహస్య వ్యక్తి అని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. టాటా వద్ద ఆరు దశాబ్దాలకు పైగా మోహన్ దత్తా నమ్మకంగా పని చేశారు. దత్తాకు చెందిన ‘స్టాలియన్ ట్రావెల్ ఏజెన్సీ’ 2013 నుంచి తాజ్ సర్వీసెస్ తో కలిసి పని చేస్తోంది.
టాటా గ్రూప్ అధికారులు చెపుతున్న వివరాల ప్రకారం… టాటా కుటుంబానికి దత్తా చాలా సన్నిహితంగా ఉండేవారు. రతన్ టాటా మరణించినప్పుడు ఆయనతో తనకున్న సాన్నిహిత్యం గురించి దత్తా మాట్లాడుతూ… టాటా తనకు 24 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి తెలుసని చెప్పారు. తాను జీవితంలో ఎదగడానికి టాటా ఎంతో సాయం చేశారని తెలిపారు.