తెలంగాణలో 45 మంది ఐఏఎస్ ల బదిలీ

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పరిపాలనను మరింత వేగవంతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ బదిలీలలో భాగంగా అత్యంత కీలకమైన సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) బాధ్యతలను రాహుల్ బొజ్జాకు అప్పగించారు. ఆయన జీఏడీ ముఖ్యకార్యదర్శిగా వ్యవహరిస్తూనే, బీసీ సంక్షేమ శాఖ అదనపు బాధ్యతలను కూడా చూసుకోనున్నారు.

సీనియర్ అధికారుల బాధ్యతల్లోనూ ప్రభుత్వం పలు మార్పులు చేసింది. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సంజయ్‌ కుమార్‌ను, రెవెన్యూ మరియు విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా దాన కిషోర్‌ను నియమించింది. ఆర్థిక మరియు ప్రణాళికా విభాగం కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్ బాధ్యతలు చేపట్టనుండగా, దేవాలయాల పర్యవేక్షణ బాధ్యతను ఎం. హనుమంతరావుకు (దేవదాయ శాఖ కమిషనర్) అప్పగించారు.

ప్రజల సమస్యల పరిష్కార వేదిక ‘ప్రజావాణి’ రాష్ట్ర నోడల్ అధికారిగా డి. దివ్యను నియమించడం గమనార్హం. కేవలం సచివాలయ స్థాయిలోనే కాకుండా జిల్లాల పాలనలోనూ ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టింది. పలు జిల్లాల కలెక్టర్లను మారుస్తూ తీసుకున్న నిర్ణయంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కొత్త కలెక్టర్‌గా అనురాగ్ జయంతి నియమితులయ్యారు. ఈ భారీ బదిలీల ద్వారా పాలనలో కొత్త ఉత్తేజం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *