గోవాలో ఘోర ప్రమాదం.. పర్యాటకుడిని బలితీసుకున్న అద్దె థార్‌ కారు!

V. Sai Krishna Reddy
1 Min Read

గోవాలో విహారయాత్ర ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సోమవారం రాత్రి ఉత్తర గోవాలోని అస్సాగావ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన 65 ఏళ్ల పర్యాటకుడు ప్రాణాలు కోల్పోయారు. అతివేగంతో వచ్చిన ఓ అద్దె థార్ కారు, వారు ప్రయాణిస్తున్న హ్యుందాయ్ ఐ20ని బలంగా ఢీకొట్టింది.

భగత్ రామ్ శర్మ (65) తన కుటుంబంతో కలిసి గోవా పర్యటనకు వచ్చారు. సోమవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో వారు ఐ20 కారులో ప్రయాణిస్తుండగా అస్సాగావ్‌లోని ‘హ్యాపీ బార్ జంక్షన్’ వద్ద ఎదురుగా వచ్చిన థార్ కారు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు భగత్ రామ్ శర్మ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మరో మహిళ గాయపడగా, ఒక చిన్నారి సురక్షితంగా బయటపడ్డాడు.

ఈ ఘటనపై అంజునా పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా, అతివేగంగా వాహనం నడిపి మరణానికి కారణమయ్యారన్న ఆరోపణలపై ఢిల్లీకి చెందిన 19 ఏళ్ల యువకుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ప్రమాదానికి కారణమైన థార్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

అయితే, ప్రమాదం జరిగిన సమయంలో థార్‌ను ఒక మహిళ నడుపుతోందని, ఆమె అతివేగంగా వచ్చి కారును ఢీకొట్టిందని ఓ ప్రత్యక్ష సాక్షి ఆరోపించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆమె పక్క సీటులోకి మారగా, కారులోని యువకుడు డ్రైవర్ సీటులోకి వచ్చాడని ఆయన పోలీసులకు వివరించారు. ఈ నేపథ్యంలో అసలు ప్రమాద సమయంలో వాహనం నడిపింది ఎవరనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పర్యాటకులు తీసుకునే అద్దె వాహనాల వల్ల తరచూ జరుగుతున్న ప్రమాదాలపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *