జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పరామర్శించిన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. “జైళ్లు మాకు కొత్త కాదు, ఉద్యమ సమయంలోనే బాల్క సుమన్ ఆరు నెలలు జైలులో ఉన్నారు. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి… నువ్వు మళ్ళీ చిప్పకూడు తినే రోజులు దగ్గరలోనే ఉన్నాయి” అని హెచ్చరించారు.
పోలీసు యంత్రాంగం తీరును కేటీఆర్ తప్పుపడుతూ.. “డీజీపీ చెప్పిన ‘ఖాకీ బుక్’ ఏమైంది? పోలీసుల బట్టలు ఊడదీసి కొడతామన్న వారిపై కేసులు ఎందుకు పెట్టడం లేదు?” అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ కలిసి ప్రతిపక్షాలపై వివక్ష చూపుతున్నాయని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని, రెండేళ్లలో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. చట్టాన్ని తుంగలో తొక్కే ఏ ఒక్కరినీ వదిలిపెట్టకుండా భవిష్యత్తులో శిక్షిస్తామని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
