పేదలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నిర్మించిన సనత్నగర్ టిమ్స్ (తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆసుపత్రి ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఉగాది పర్వదినం సందర్భంగా మార్చి 19న ఈ ఆసుపత్రిని ప్రారంభించి ప్రజలకు అంకితం చేయనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు.
గురువారం హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మార్చి రెండో వారంలోగా సివిల్ పనులు, పరికరాల ఏర్పాటు, సిబ్బంది నియామకం వంటివి పూర్తి చేసి, ప్రారంభోత్సవం నాటికి ఆసుపత్రిని పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
1000 పడకల సామర్థ్యంతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో మౌలిక వసతుల పనులు తుది దశకు చేరుకున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. అత్యంత కీలకమైన 16 ఆపరేషన్ థియేటర్లు శస్త్రచికిత్సలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే హైదరాబాద్లోని నిమ్స్, గాంధీ, ఉస్మానియా వంటి ప్రధాన ఆసుపత్రులపై రోగుల భారం గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది
