బీఆర్ఎస్‌లోనే ఉన్నా.. నా వేతనం నుండి నెలకు రూ.5 వేలు ఆ పార్టీకి కట్ అయ్యాయి: జగిత్యాల ఎమ్మెల్యే

V. Sai Krishna Reddy
1 Min Read

తాను గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచానని, ఇప్పటికీ అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేనని జగిత్యాల శాసన సభ్యుడు సంజయ్ కుమార్ అన్నారు. తన జీతం నుండి నెలకు రూ.5 వేలు బీఆర్ఎస్ పార్టీకి కట్ అయ్యాయని వెల్లడించారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని అఫిడవిట్ కూడా ఇచ్చానని తెలిపారు. జగిత్యాల అభివృద్ధి కోసం తాను ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నానని స్పష్టం చేశారు.

జగిత్యాల అభివృద్ధి కోసం తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని, ఆ సమయంలో ఆయన శాలువా కప్పారని అన్నారు. తాను ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వెళ్లలేదని అన్నారు. కలిసి పని చేస్తామని చెప్పాం తప్ప పార్టీలో చేరినట్లు ఎక్కడా పేర్కొనలేదని అన్నారు. కానీ ఆధారాలు లేకుండా మీడియా అసత్య ప్రచారం చేసిందని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని భావించి బీఆర్ఎస్ వాళ్లు తన ఆసుపత్రి వద్ద రచ్చరచ్చ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

వివరణ ఇవ్వడానికి తనకు కనీసం అవకాశం ఇవ్వలేదని, నోటీసు కూడా ఇవ్వలేదని అన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా ఇదే విషయం అడిగారని అన్నారు. తన ఖాతా నుంచి గత మార్చి వరకు బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు కట్ అయ్యాయని అన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ స్వయంగా దానిని ఆపేసిందని అన్నారు.

కాగా, సంజయ్ పార్టీ మారారని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌ను స్పీకర్ ప్రసాద్ కుమార్ ఈరోజు కొట్టివేశారు. సంజయ్ పార్టీ మారినట్లు ఆధారాలు చూపించలేకపోయారని ఈ సందర్భంగా స్పీకర్ పేర్కొన్నారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పిటిషన్లు దాఖలు చేయగా, ఈరోజు వరకు 8 మంది ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ తీర్పు ఇచ్చారు. వారిపై అనర్హత పిటిషన్లను కొట్టివేశారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *