పడిపోతున్న డాలర్.. నిలకడగా రూపాయి

V. Sai Krishna Reddy
2 Min Read

ప్రపంచ కరెన్సీ మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులు కొనసాగుతున్నాయి. ప్రధాన కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలర్ బలహీనపడుతుండగా, భారత రూపాయి మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. డాలర్ బలహీనత కారణంగా భారత్‌లోకి విదేశీ సంస్థాగత పెట్టుబడులు (FII) పెరిగే అవకాశం ఉందని ఎమ్‌కే వెల్త్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ మంగళవారం విడుదల చేసిన నివేదికలో అంచనా వేసింది.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత తగ్గించవచ్చన్న అంచనాలు, అంతర్జాతీయ పరిణామాల కారణంగా డాలర్ విలువ పడిపోతోందని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ సుమారు రూ.90 వద్ద నిలకడగా ఉందని, స్వల్పకాలంలో ఇదే స్థాయిలో కన్సాలిడేట్ కావొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నట్లు తెలిపింది. భారత్ నికర దిగుమతిదారుగా ఉండటం రూపాయిపై భారం మోపుతున్నప్పటికీ, విదేశీ పెట్టుబడులకు అవకాశాలు మెరుగుపడటం మద్దతుగా నిలుస్తుందని వివరించింది.

గత 18 నెలలుగా భారత ఈక్విటీ మార్కెట్లలో విదేశీ సంస్థలు నికర అమ్మకందారులుగా ఉన్నాయి. దీంతో పలు రంగాల్లో షేర్ల విలువ ఆకర్షణీయంగా మారింది. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గితే, డాలర్‌పై రాబడి తగ్గి, భారత్ వంటి వర్ధమాన మార్కెట్ల వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

బలహీనపడిన డాలర్, వర్ధమాన మార్కెట్ల వైపు పెట్టుబడుల మళ్లింపు వంటివి అవకాశాలను, అదే సమయంలో నష్టభయాలను కూడా సృష్టిస్తున్నాయి. భారత్‌లో స్థిరమైన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు కొనసాగితే, ప్రపంచ ఒడుదొడుకులు ఉన్నప్పటికీ రూపాయి ప్రస్తుత స్థాయిలోనే కొనసాగవచ్చు” అని ఎమ్‌కే వెల్త్ మేనేజ్‌మెంట్ సేల్స్ హెడ్ పరాగ్ మోరే వివరించారు.

2025 ప్రారంభం నుంచి డాలర్ ఇండెక్స్ దాదాపు 9 శాతం పడిపోయి 98.60 వద్ద ఉంది. అయితే, సముద్ర రవాణా మార్గాలకు అంతరాయాలు లేదా ముడిచమురు సరఫరాలో సమస్యలు తలెత్తితే స్వ‌ల్ప‌కాలంలో డాలర్‌కు మళ్లీ డిమాండ్ పెరిగే ప్రమాదం ఉందని, కాబట్టి హెడ్జింగ్ వ్యూహాలు పాటించడం మంచిదని నివేదిక సూచించింది

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *