సంక్రాంతి కోడిపందెం.. పాపం, కోటి రూపాయలు నష్టపోయాడు

V. Sai Krishna Reddy
2 Min Read

సంక్రాంతి పండుగ సందర్భంగా కృష్ణా జిల్లాలో నిర్వహించిన కోడి పందేలు సంచలనంగా మారాయి. గన్నవరం మండలం కేసరపల్లి బరిలో జరిగిన కోడి పందెం ఏకంగా కోటి రూపాయల స్థాయికి చేరడం హాట్ టాపిక్ అయింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ముసుగు కోడి పందెంలో హైదరాబాద్‌కు చెందిన జినెక్స్ అమర్ కోడి విజయం సాధించి కోటి రూపాయలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ పందెంలో హైదరాబాద్‌కు చెందిన జినెక్స్ అమర్ కోడి, కృష్ణా జిల్లాకు చెందిన జాట్టు సుబ్రమణ్యం కోడితో తలపడింది. రెండు కోళ్ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొనగా, చివరకు అమర్ కోడి ప్రత్యర్థిని ఓడించి విజేతగా నిలిచింది. దీంతో మొత్తం పందెం అమర్ వర్గం ఖాతాలోకి వెళ్లింది.

ఈ ఓటమితో జాట్టు సుబ్రమణ్యం వర్గం కోటి రూపాయల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది. పందెం ముగిసిన అనంతరం ఈ వ్యవహారం పలు వర్గాల్లో చర్చనీయాంశమయింది. ఇది కోడి పందేల వెనుక జరుగుతున్న భారీ ఆర్థిక లావాదేవీలకు నిదర్శనంగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కోటి రూపాయల ప్రధాన పందెంతో పాటు, చుట్టుపక్కల ఉన్నవారు, వివిధ వర్గాల మధ్య లక్షల రూపాయల్లో పై పందెలు జరిగినట్లు సమాచారం. ఒక్కో రౌండ్‌కు లక్షల రూపాయలు చేతులు మారినట్లు స్థానికంగా చర్చ సాగుతోంది.

ముసుగు కోడి పందెంగా దీన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. బయటకు పెద్దగా సమాచారం లీక్ కాకుండా పరిమిత వ్యక్తుల మధ్యే ఈ వ్యవహారం సాగినప్పటికీ, విషయం వెలుగులోకి రావడంతో జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

ఈ ఏడాది కేసరపల్లి బరి వీఐపీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని అంటున్నారు. కృష్ణా జిల్లాతో పాటు హైదరాబాద్, భీమవరం, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి కూడా ప్రముఖులు ఈ పందాలను వీక్షించేందుకు వచ్చినట్లు సమాచారం. పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ, కొంతమంది నేతల అండదండలతో పందాలు బహిరంగంగానే సాగాయి. పందెం సందర్భంగా హైటెక్ బరులు, బౌన్సర్లు, ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *