శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర ఆలయంలో ఆదివారం రాత్రి దొంగలు పడ్డారు. ఆలయం వెనుక ద్వారం గుండా లోపలికి ప్రవేశించిన దొంగలు.. గర్భగుడిలో స్వామి వారికి అలంకరించిన నగలను ఎత్తుకెళ్లారు. చోరీకి గురైన ఆభరణాల విలువ సుమారు రూ. 60 లక్షల వరకు ఉంటుందని ఆలయ ధర్మకర్త ముకుంద పండా వెల్లడించారు. దీనిపై కాశీబుగ్గ పోలీసులకు ముకుంద పండా ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలాన్ని కాశీబుగ్గ డీఎస్పీ షేక్ సహబాజ్ అహ్మద్, సీఐ రామకృష్ణ పరిశీలించారు.
ఏకాదశి నుంచి మూతపడ్డ ఆలయం
ఏకాదశి సందర్భంగా గతేడాది నవంబర్ 1న ఈ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఊహించని రీతిలో భక్తులు రావడంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరగగా.. తొమ్మిది మంది భక్తులు మరణించారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసుల ఆదేశాల మేరకు దేవాలయంలో దర్శనాలు నిలిపివేశారు. అప్పటి నుంచి ఆలయం మూతపడి ఉంది.
