నిజామాబాద్‌ ఎమ్మెల్సీ బరిలో మంత్రి అజారుద్దీన్?

V. Sai Krishna Reddy
1 Min Read

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాతో ఖాళీ అయిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మంత్రి అజారుద్దీన్‌ను బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న అజారుద్దీన్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలన్న సిఫార్సు పెండింగ్‌లో ఉండటంతో అధికార పార్టీ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లోపు అంటే ఏప్రిల్ 31 నాటికి ఆయన శాసనసభ లేదా మండలి సభ్యుడిగా ఎన్నికవ్వాల్సి ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.

గత ఏడాది అక్టోబరు 31న మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజారుద్దీన్‌కు ఏప్రిల్ నాటికి గడువు ముగుస్తుంది. గవర్నర్ కోటా నియామకంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంతో రాజ్‌భవన్ నుంచి ఇంకా ఆమోదం లభించలేదు. ఈ నేపథ్యంలో మంత్రి పదవిని నిలబెట్టుకోవాలంటే ఎన్నికల ద్వారా చట్టసభకు వెళ్లడం ఒక్కటే మార్గం. దీంతో కవిత ఖాళీ చేసిన స్థానాన్ని అజారుద్దీన్‌కు కేటాయించి, ఆయనను మండలికి పంపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక సంస్థల కాలపరిమితి ముగిసింది. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల అనంతరం కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో ఓటరు జాబితా రూపొందించి, నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధిస్తుందని, తద్వారా అజారుద్దీన్‌ను గెలిపించుకోవడం సులభమవుతుందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పరిషత్ ఎన్నికలు ఆలస్యమైనా, కేవలం మున్సిపల్ ఓటర్లతోనే ఉప ఎన్నిక నిర్వహించేలా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *