దివంగత రిటైర్డ్ ఎంఈఓ వెంకట్ రావు శంభు జ్ఞాపకార్థం…
అంగన్వాడీ భవనానికి స్థలం విరాళం చేసిన కుటుంబ సభ్యులు
కొడంగల్ జనవరి 08 ప్రజా జ్యోతి
కొడంగల్ మండలం పెద్ద నందిగామ గ్రామంలోని అంగన్వాడీ పాఠశాలకు సొంత భవనం లేక చిన్నారులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దివంగత రిటైర్డ్ మండల విద్యాధికారి వెంకట్ రావు శంభు కుటుంబం గొప్ప మనసు చాటుకుంది. అంగన్వాడీ పాఠశాల భవన నిర్మాణం కోసం తమ సొంత భూమిని విరాళంగా ఇవ్వాలని కుమారులు నిర్ణయించారు.
స్థానిక సర్పంచ్ చెన్బస్ కుమార్, మాజీ సర్పంచ్ సంజీవ్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి విజ్ఞప్తికి స్పందించిన శంభు వెంకట్ రావు కుమారులు అరవింద్ రావు శంభు, రాఘవేందర్ రావు శంభు, లక్ష్మణ్ రావు తమ తండ్రి, వెంకట్ రావు శంభు, దివంగత తల్లి అనుసూయ బాయి శంభు వారి జ్ఞాపకార్థం అంగన్వాడీ పాఠశాల భవనం నిర్మించేందుకు స్థలాన్ని విరాళంగా అందజేశారు.
దివంగత వెంకట్ రావు శంభు ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా, మండల విద్యాధికారిగా కొడంగల్ నియోజకవర్గంలో సేవలందించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారని గ్రామ పెద్దలు గుర్తు చేశారు.
బుధవారం అంగన్వాడీ పాఠశాల భవన నిర్మాణానికి సర్పంచ్ చెన్బస్ కుమార్ ఆద్వర్యంలో రాఘవేంద్రరావు శంభు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్, మాజీ సర్పంచ్ సంజీవ్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి శంభు వెంకట్ రావు కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో వారి పేరు మీద పాఠశాల భవనం నిర్మించుకోవడం గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి డేవిడ్, రవికుమార్, మార్కెట్ యార్డ్ కమీషన్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, మండల కాంగ్రెస్ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ ఆరిఫ్, మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు లింగం చంద్రప్ప, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు కె. భీమప్పతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.

