దిల్లీ ఎర్రకోట సమీపంలో గతేడాది జరిగిన కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలక విషయాలు వెలుగులోకి తెచ్చింది. ఈ కేసులో అరెస్టయిన ‘వైట్ కాలర్’ ఉగ్రవాదులు.. పాకిస్థాన్లోని తమ హ్యాండ్లర్లతో మాట్లాడేందుకు ‘ఘోస్ట్ సిమ్’ కార్డులు, ఎన్క్రిప్టెడ్ యాప్లను వాడినట్లు తేలింది.
విచారణలో నిందితులైన వైద్యులు ‘డ్యూయల్ ఫోన్’ విధానాన్ని అనుసరించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఒక ఫోన్ను తమ వ్యక్తిగత, వృత్తిపరమైన అవసరాలకు వాడుతూ, రెండో ఫోన్ను కేవలం ఉగ్ర కార్యకలాపాలకే పరిమితం చేశారు. ఈ ‘టెర్రర్ ఫోన్’లో వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్ల ద్వారా పాకిస్థాన్లోని ‘ఉకాసా’, ‘ఫైజాన్’, ‘హష్మీ’ అనే కోడ్ నేమ్స్ ఉన్న హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరిపారు.
నకిలీ లేదా ఇతరుల ఆధార్ వివరాలతో తీసుకున్న సిమ్లనే ‘ఘోస్ట్ సిమ్’లుగా పిలుస్తున్నారు. ఈ సిమ్ కార్డు ఫోన్లో లేకపోయినా ఎన్క్రిప్టెడ్ యాప్లు పనిచేసేలా ఈ టెక్నాలజీని వాడుకున్నారు. దీనివల్ల వీరిని ట్రేస్ చేయడం కష్టంగా మారింది. హ్యాండ్లర్ల నుంచి యూట్యూబ్ ద్వారా ఐఈడీల తయారీ నేర్చుకుని దేశంలో దాడులకు ప్లాన్ చేసినట్లు తేలింది.
ఈ ఉగ్ర కుట్ర వెలుగులోకి రావడంతోనే కేంద్ర టెలికమ్యూనికేషన్ల విభాగం (డాట్) గతేడాది నవంబర్లో కీలక నిబంధనలు తీసుకొచ్చింది. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్లు ఇకపై ఫిజికల్ సిమ్ కార్డు డివైజ్లో ఉంటేనే పనిచేసేలా చట్టం చేసింది. ఒకవేళ సిమ్ తీసేస్తే లేదా ఫోన్ మార్చితే ఆటోమేటిక్గా లాగౌట్ అయ్యేలా నిబంధనలు అమలులోకి వచ్చాయి. గతేడాది నవంబర్ 10న జరిగిన ఈ పేలుడులో పలువురు ప్రాణాలు కోల్పోగా, ఎన్ఐఏ విచారణను మరింత ముమ్మరం చేసింది.
