హైదరాబాద్ (ప్రజాజ్యోతి): రేషన్ కార్డుదారులకు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తీవ్రంగా ఖండించారు. ఈకేవైసీ (e-KYC) చేసుకోకుంటే రేషన్ ఆపేస్తారని లేదా కార్డులు రద్దవుతాయని వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈకేవైసీ నమోదు ప్రక్రియపై కమిషనర్ పలు కీలక అంశాలను వెల్లడించారు. ఈకేవైసీ చేయించుకోకపోతే రేషన్ బియ్యం ఆపేస్తారన్నది కేవలం తప్పుడు ప్రచారం మాత్రమే. బియ్యం పంపిణీ యథావిధిగా కొనసాగుతుంది. ఈకేవైసీ నమోదుకు ప్రభుత్వం ఎటువంటి తుది విధించలేదని, ప్రజలు తమకు వీలున్నప్పుడు ఎప్పుడైనా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. రేషన్ వ్యవస్థలో పారదర్శకత కోసం ప్రతి ఒక్కరూ ఈకేవైసీ పూర్తి చేయాలని, దీనిపై ఇప్పటికే క్షేత్ర స్థాయిలో అధికారులకు, ప్రజలకు సమాచారం అందించామని పేర్కొన్నారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే గందరగోళ వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని స్టీఫెన్ రవీంద్ర అన్నారూ. ప్రభుత్వం ఎల్లప్పుడూ లబ్ధిదారుల సంక్షేమం కోసమే పనిచేస్తుందని, ఏదైనా మార్పులు ఉంటే అధికారికంగా ప్రకటిస్తామని ఆయన వివరించారు.
