ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయనకు టీడీపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు. ఎకనామిక్ టైమ్స్ ప్రతిష్ఠాత్మక పురస్కారం బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025 అవార్డుకు ఎంపికైనందుకు చంద్రబాబును ఎంపీలు ఘనంగా సత్కరించారు. ఆయనకు బొబ్బిలి వీణను బహూకరించారు. అదే సమయంలో, సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రామ్మోహన్ నాయుడితో ఎయిర్ పోర్టులోనే కేక్ కట్ చేయించి ఆనందం నింపారు.
ఆరుగురు కేంద్రమంత్రులతో భేటీలు
కాగా, ఢిల్లీ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు రేపు ఆరుగురు కేంద్రమంత్రులను కలవనున్నారు. కేంద్ర హోంశాఖ, రోడ్లు, పెట్రోలియం, జలశక్తి, ఆర్థిక, షిప్పింగ్ శాఖల మంత్రులను కలవనున్నారు. ఉదయం 9.45 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ను కలవనున్నారు. అనంతరం హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అవుతారు. ఉదయం 11.30 గంటలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం కానున్నారు.
మధ్యాహ్నం 12 గంటల తర్వాత షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ ను కలవనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు క్రెడాయ్ అవార్డుల కార్యక్రమానికి హాజరవుతారు. సాయంత్రం 4 గంటలకు పెట్రోలియం శాఖ మంత్రి హర్ దీప్ పూరితో భేటీ అవుతారు. సాయంత్రం 6.30 గంటలకు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం ఉంటుంది
