తెలంగాణ పంచాయతీ ఎన్నికలు… రెండో విడతలో 415 మంది సర్పంచ్ లు ఏకగ్రీవం

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల రెండో విడతలో ఏకగ్రీవాలు భారీగా నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 415 మంది సర్పంచ్ అభ్యర్థులు, 8,304 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అధికారికంగా ప్రకటించింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే, కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 44 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో చెరో 38 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

రెండో విడతలో భాగంగా 4,332 గ్రామ పంచాయతీలకు, 38,322 వార్డులకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఐదు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవికి, 107 వార్డుల్లో సభ్యుల పదవులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి సర్పంచ్ బరి నుంచి 7,584 మంది, వార్డు సభ్యుల బరి నుంచి 10,427 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

ఇప్పటి వరకు జరిగిన రెండు విడతలను కలిపి చూస్తే, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 810 మంది సర్పంచ్‌లు, 17,635 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటనలో స్పష్టం చేసింది. మిగిలిన స్థానాలకు త్వరలోనే పోలింగ్ జరగనుంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *