శ్రీశైలం వెళ్తుండగా కారు దగ్ధం.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డ హైదరాబాద్ కుటుంబం

V. Sai Krishna Reddy
1 Min Read

శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్తున్న భక్తులు పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. వారు ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అది పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా, అమ్రాబాద్‌ మండలం, కృష్ణగిరి (ఈగలపెంట) సమీపంలో చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని చిక్కడపల్లికి చెందిన ఆకుల ప్రణవ్‌కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో శ్రీశైలం బయలుదేరారు. ఆయనతో పాటు భార్య, కుటుంబ సభ్యులు జయశ్రీ, తేజశ్రీ, శ్రీవల్లి, వాంగ్మయి ఉన్నారు. వారి వాహనం కృష్ణగిరి గ్రామ సమీపానికి రాగానే ఇంజిన్ నుంచి పొగలు రావడం మొదలైంది.

దీన్ని గమనించిన ప్రణవ్‌కుమార్ వెంటనే అప్రమత్తమై కారును రోడ్డు పక్కన ఆపి, కుటుంబ సభ్యులందరినీ కిందకు దించేశారు. వారు కిందకు దిగిన కొద్దిసేపటికే కారు నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే కారు పూర్తిగా కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. డ్రైవర్ అప్రమత్తత వల్లే పెను ప్రమాదం తప్పిందని ఎస్సై జయన్న తెలిపారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *